ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తే, అమెరికా నిర్లక్ష్యం వహించదని ఇటీవల అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై చైనా చాలా తీవ్రంగా స్పందించింది.
తైవాన్ విషయంలో అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్హెగ్సెత్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ, వాషింగ్టన్కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ.. తైవాన్ అంశం పూర్తిగా చైనా అంతర్గత వ్యవహారమని, ఇందులో మూడో దేశాలు జోక్యం చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పారు. అమెరికా నిప్పుతో ఆడకూడదని, దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
సింగపూర్లో జరిగిన అంతర్జాతీయ భద్రతా సదస్సులో పాల్గొన్న పీట్ హెగ్సెత్, చైనాపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తైవాన్ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ దేశం తైవాన్పై దూకుడుగా వ్యవహరిస్తోందని, సముద్ర మార్గాల్లో దాని దురాక్రమణలు పెరుగుతున్నాయని చెప్పారు.
చైనా, తైవాన్ చుట్టూ యుద్ధ నౌకలు మోహరిస్తూ ఆ ప్రాంతాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని తెలిపారు. తైవాన్ను బలవంతంగా కలుపుకోవాలన్న చైనా ఆలోచన ప్రమాదకరమని హెచ్చరించారు.
ఇండో-పసిఫిక్లో అమెరికా మద్దతు
ఇండో-పసిఫిక్ ప్రాంత దేశాలు చైనా ఒత్తిళ్లకు గురవుతున్న నేపథ్యంలో, వాటిని గాలికి వదిలేసే ప్రసక్తే లేదని హెగ్సెత్ స్పష్టం చేశారు. ఆ దేశాల రక్షణ బలాన్ని పెంచేందుకు అమెరికా పూర్తిగా మద్దతుగా ఉంటుందని చెప్పారు. ఆయా దేశాలు తమ రక్షణ వ్యయాన్ని పెంచుకోవాలని సూచించారు. అలాగే చైనా లాటిన్ అమెరికాపై కన్నేసిందని, ప్రత్యేకంగా పనామా కాలువపై దాని పట్టు బలపరిచే ప్రయత్నాలు చేస్తోందని హెగ్సెత్ అన్నారు. మరి చైనా స్పందించిన తీరుకు అమెరికా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.