ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణానికి కాస్త ముందుగానే ప్రవేశించాయి. వర్షాలు అంచనాలను మించి కురవడంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. అయితే ఇదే స‌మ‌యంలో వాతావ‌ర‌ణ శాఖ ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది.

వర్షాలకి బ్రేక్..

రుతుపవనాల కదలిక ఈశాన్య భారతదేశం వైపు చురుగ్గా సాగుతోందంటే, దక్షిణ భారతదేశంలో మాత్రం అది మందగించింది. దీంతో తెలంగాణలో వర్షాల ఉత్సాహానికి కొంత బ్రేక్ పడింది. వాతావరణ కేంద్రం ప్రకారం జూన్ ప్రారంభంలో వర్షాల తీవ్రత తగ్గి, మళ్లీ ఎండలు పెరిగే అవకాశముందని వెల్లడించింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

జూన్ 1వ తేదీన వాతావ‌ర‌ణం ఎలా ఉండ‌నుందంటే.?

మే 31, జూన్ 1 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల్ జిల్లాలకు గ్రీన్ అలర్ట్ జారీ చేశారు. మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణమే కొనసాగనుంది.

రోహిణీ కార్తె వేడి మళ్లీ ప్రారంభమవుతుందా?

సాధారణంగా రోహిణీ కార్తెను అత్యధిక ఎండల కాలంగా పేర్కొంటారు. ఈ ఏడాది (2025) రోహిణీ కార్తె మే 25 నుంచి జూన్ 8 వరకు ఉంది. వర్షాలు ముందుగానే రావడంతో ప్రజలు ఎండలు తక్కువగానే ఉంటాయని భావించారు. కానీ ప్రస్తుతం రుతుపవనాల మందగతం కారణంగా మళ్లీ ఎండల తీవ్రత పెరిగే అవకాశముంది.

జూన్ మొదటి వారంలో ఉష్ణోగ్రతల పెరుగుదల

ప్రస్తుతం ఉష్ణోగ్రతలు సాధారణంతో పోల్చితే 3 నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. అయితే జూన్ మొదటి వారంలో ఉష్ణోగ్రతలు మళ్లీ 2–3 డిగ్రీలు పెరిగే అవకాశముంది. పశ్చిమ దిశ నుంచి వచ్చే కింది స్థాయి గాలుల ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.