సింధు జలాల ఒప్పందం రద్దు ఎఫెక్ట్ ... పాక్ లో చినాబ్ నది ఎండిపోతోందా?

Synopsis
పాకిస్తాన్లో చినాబ్ నది ఎండిపోతోందా? దీనికి భారత్ సింధు నది జలాల ఒప్పందం రద్దు కారణమా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. కొన్ని శాటిలైట్ చిత్రాలు పాకిస్థాన్ లో చీనాబ్ నది పరిస్థితిని తెలియజేస్తున్నాయి.
Pakistan : జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకుంది. వాటిలో అతి కఠినమైనది సింధు జల ఒప్పందాన్ని (IWT) నిలిపివేయడం. దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. చినాబ్ నది ఉపగ్రహ చిత్రాలను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సింధు జలాలను నిలిపివేయడానికి ముందు, తర్వాత పరిస్థితిని ఇందులో చూపించారు. పాకిస్తాన్లో చినాబ్ నది ఎండిపోయిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే నిజమైతే ప్రధాని మోడీ సింధు జలాల ఒప్పందం రద్దు నిర్ణయంతో పాకిస్థాన్ అల్లాడిపోవడం ఖాయం
పాకిస్తాన్కు నీటిని అందించే సింధు నది వ్యవస్థలోని మూడు నదులలో చినాబ్ ఒకటి. మిగిలిన రెండు నదులు సింధు, జీలం. ఉపగ్రహ చిత్రాల ప్రకారం పాకిస్తాన్ పంజాబ్లోని సియాల్కోట్ సమీపంలో చినాబ్ నది ఎండిపోతోంది.
రెండు ఉపగ్రహ చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒక చిత్రం 26 ఏప్రిల్ 2025 నాటిది. అదే రోజు భారత్ పాకిస్తాన్కు సింధు జల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు తెలియజేసింది. రెండో చిత్రం 29 ఏప్రిల్ నాటిది. నదిలో నీరు చాలా తక్కువగా ఉందని ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది.
1960లో భారత్, పాకిస్తాన్ మధ్య సింధు జల ఒప్పందం
1960లో భారత్, పాకిస్తాన్ మధ్య సింధు జల ఒప్పందం కుదిరింది. దీనికి ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించింది. దీని ద్వారా భారత్, పాకిస్తాన్ మధ్య సింధు నది, దాని ఉపనదుల నీటి పంపిణీ, వినియోగాన్ని నియంత్రిస్తారు. సింధు నది వ్యవస్థలో ప్రధాన నది సింధు, దాని ఉపనదులు ఉన్నాయి.
రావి, బియాస్, సట్లెజ్, జీలం, చినాబ్ ఎడమ ఒడ్డున ఉపనదులు. కాబూల్ నది కుడి ఒడ్డున ఉపనది. ఇది భారత భూభాగం గుండా ప్రవహించదు. రావి, బియాస్, సట్లెజ్లను కలిపి తూర్పు నదులు అంటారు. సింధు, జీలం, చినాబ్లను పశ్చిమ నదులు అంటారు. ఈ నది వ్యవస్థలోని నీరు భారత్, పాకిస్తాన్ రెండింటికీ ముఖ్యమైనది. పంటలకు నీటిపారుదల నుండి తాగునీరు వరకు పాకిస్తాన్ సింధు నదిపై ఆధారపడి ఉంది.