- Home
- Telangana
- Miss World 2025: నాగార్జున సాగర్ కు మిస్ వరల్డ్ కంటెస్టంట్స్.. ఇంకా ఏ ప్రాంతాలను సందర్శించనున్నారో తెలుసా?
Miss World 2025: నాగార్జున సాగర్ కు మిస్ వరల్డ్ కంటెస్టంట్స్.. ఇంకా ఏ ప్రాంతాలను సందర్శించనున్నారో తెలుసా?
Miss World 2025: హైదరాబాద్లో మిస్ వరల్డ్ 2025 ఈవెంట్ గ్రాండ్ ప్రారంభం అయింది. శాంతి, ఐక్యతకు తెలంగాణ నుండి ప్రపంచానికి సందేశం ఇవ్వడంతో పాటు రాష్ట్ర టూరిజానికి మరింత ఉత్సాహం, పెట్టుబడులను ఆకర్షించడం వంటి పలు లక్ష్యాలతో తెలంగాణ సర్కారు ఈ మెగా ఈవెంట్ ను నిర్వహిస్తోంది.

Miss World 2025: హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ 2025 72వ ఎడిషన్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ‘బ్యూటీ విత్ ఏ పర్పస్’ అనే థీమ్తో ప్రారంభం కాగా, ప్రపంచ శాంతి, ఐక్యతకు ఒక శక్తివంతమైన సందేశాన్ని అందించనుంది.
110 దేశాలకు పైగా నుండి వచ్చిన అందాల రాణులకు తెలంగాణ సంప్రదాయ నృత్యాలైన పెరీని, కొమ్ము కోయ, లంబాడ, ఒగ్గు డోలు ప్రదర్శనలతో హృదయపూర్వక స్వాగతం పలికారు. ఈ ప్రదర్శనలు రాష్ట్ర సంప్రదాయ వైభవాన్ని ప్రపంచానికి చూపించాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, "తెలంగాణకు మిస్ వరల్డ్ వేదిక కావడం గర్వకారణం" అని తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాలకు ఇక్కడ నుంచి శాంతి సందేశం వెళ్లాలని ఆకాంక్షించారు. మిస్ వరల్డ్ లిమిటెడ్ ఛైర్మన్, సీఈఓ జూలియా మార్లీ ఈ వేడుకను అధికారికంగా ప్రారంభిస్తూ, "తెలంగాణ వంటి సంప్రదాయాలు, ఆధునికత కలిసిన ప్రదేశంలో ఈ వేడుక జరగడం సంతోషంగా ఉందని" అన్నారు.
Miss World 2025
తెలంగాణలో గ్రామీణ పర్యటనలు చేయనున్న ప్రపంచ సుందరీమణులు
మే 12 (సోమవారం) నుండి మిస్ వరల్డ్ 2025 కంటెస్టంట్స్ తెలంగాణలోని గ్రామీణ పర్యటనలో పాల్గొంటున్నారు. ఈ పర్యటనలో నాగార్జున సాగర్, బుద్ధవనం, రామప్ప దేవాలయం, యాదగిరిగుట్ట, పొచంపల్లి తదితర ప్రదేశాలను చూడనున్నారు. మే 12న బుద్ధపౌర్ణమి సందర్భంగా బుద్ధవనంలో కంటెస్టంట్స్ ధ్యానం కార్యక్రమాలలో పాల్గొంటారు. జటక వనం సందర్శన, విజయ విహార్, బుద్ధ మెడిటేషన్ హాల్లో కార్యక్రమాలు జరుగుతాయి.
మే 14న హన్మకొండలోని వెయ్యి స్తంభాల గుడి, వరంగల్ కోట సందర్శించనున్నారు. UNESCO వారసత్వ కట్టడం అయిన రామప్ప ఆలయంలో పెరీని శివతాండవం ప్రదర్శన చూడనున్నారు. మే 15న యాదగిరిగుట్ట ఆలయం, పొచంపల్లి చీరల నేతన్నల సమాఖ్యను సందర్శించి, అక్కడి కళాకారులతో ముచ్చటించనున్నారు. మే 16న మహబూబ్నగర్లోని ప్రాచీన పిల్లలమరి వటవృక్షం వద్ద పర్యటన ఉంటుంది. మే 21న శిల్పారామంలో కళా శిల్పాల వర్క్షాప్లో పాల్గొంటారు.
ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు లభించే అవకాశం ఉంది. గ్రామీణ అభివృద్ధికి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు ఇది ముఖ్యమైన దశగా భావిస్తున్నారు. అధికారికంగా విడుదలైన ప్రకటన ప్రకారం, బుద్ధవనం వంటి ప్రదేశాలను ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.