Hyderabad : వస్తావా..? నీ రేట్ ఎంత..? : అర్థరాత్రి ఓ మహిళా ఐపిఎస్ కు ఎదురైన అనుభవం
Women Safety in Hyderabad : ఐటీ సిటీ హైదరాబాద్ లో మహిళలకు భద్రత ఉందా..? అంటే లేదనే సమాధానమే వినిపిస్తోంది. స్వయంగా ఓ మహిళా పోలీస్ కమీషనర్ కే ఆకతాయిల వేధింపులు తప్పలేేవంటే… సామాన్య మహిళల పరిస్థితి ఏంటి..?

ఇదీ హైదరాబాద్ లో మహిళల పరిస్థితి..
Hyderabad : నగరంలో మహిళల భద్రత పరిస్థితి ఏంటి..? రాత్రిపూట ఒంటరిగా వెళ్లే మహిళలకు సెక్యూరిటీ ఉందా..? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు ఏకంగా ఓ మహిళా పోలీస్ కమిషనరే రంగంలోకి దిగారు. సాధారణ మహిళలా బస్ స్టాప్లో నిల్చొని, క్షేత్రస్థాయిలో పరిస్థితిని స్వయంగా చూశారు. ఈ క్రమంలో సదరు మహిళా ఐపిఎస్ కు షాకింగ్ అనుభవం ఎదురైంది. కేవలం మూడు గంటల్లోనే దాదాపు 40 మంది ఆమెను వేధించారు. ఈ ఘటన ఎక్కడో బిహార్, ఉత్తర్ ప్రదేశ్ లో కాదు మన హైదరాబాద్లోనే జరిగింది.
నడిరోడ్డుపై మహిళా కమీషనర్ కు వేధింపులు..
వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ మహిళా ఐపిఎస్ అధికారి సుమతి ఈ నెల మే 1న మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గా చార్జ్ తీసుకున్నారు. ఇదేరోజు అర్థరాత్రి మహిళల భద్రత గురించి స్వయంగా తెలుసుకునేందుకు వినూత్న ప్రయోగానికి పూనుకున్నారు. హైదరాబాద్లో నిత్యం రద్దీగా ఉండే దిల్సుఖ్నగర్ బస్ స్టాండ్ దగ్గర ఆమె ఒక సాధారణ ప్రయాణికురాలిలా, మామూలు బట్టలు వేసుకుని నిల్చున్నారు. ఎలాంటి అధికారిక హోదా, సెక్యూరిటీ లేకుండా, ముఖానికి మాస్క్ కూడా పెట్టుకోకుండా అర్థరాత్రి 12:30 నుంచి తెల్లవారుజామున 3:30 వరకు అక్కడే ఉన్నారు.
ఆమె ఒంటరిగా నిల్చోవడం చూసి కేవలం మూడు గంటల వ్యవధిలోనే దాదాపు 40 మంది పురుషులు ఆమెను వేధించేందుకు ప్రయత్నించారు. ఆమె పోలీస్ కమిషనర్ అని తెలియక అసభ్యంగా మాట్లాడారు... రాత్రికి వస్తావా..? రేట్ ఎంత..? అంటూ అసభ్యకరంగా మాట్లాడుతూ ఇబ్బంది పెట్టారు. ఇలా వేధించిన వారిలో డ్రగ్స్కు బానిసలైన వారి నుంచి మొదలుకొని, బాగా చదువుకున్న యువకుల వరకు ఉండటం గమనార్హం.
ఆకతాయిల ఆటకట్టించిన కమీషనర్
అయితే కమిషనర్ సుమతికి భద్రతగా కొద్ది దూరంలో మఫ్టీలో పోలీసులు ఉన్నారు. ఎవరైనా ఆమెను వేధించగానే కమిషనర్ సిగ్నల్ ఇవ్వడం, వెంటనే పోలీసులు వాళ్లను పట్టుకోవడం చకచకా జరిగిపోయాయి. పట్టుబడిన వారిలో సగం మంది చదువుకునే విద్యార్థులు, ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు. కొందరు తాగిన మైకంలో ఉన్నారు. వీరిపై క్రిమినల్ కేసులు పెట్టకుండా కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు. పబ్లిక్లో ఒక మహిళ ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో, మహిళల భద్రత గురించి వారికి అవగాహన కల్పించారు.
రాత్రిపూట ఉద్యోగాలు ముగించుకుని ఇళ్లకు వెళ్లే మహిళలు, ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో స్వయంగా తెలుసుకోవడానికే ఈ ప్రయత్నం చేశానని కమిషనర్ సుమతి ఐపీఎస్ తెలిపారు. ఈ అనుభవంతో నగరంలో నైట్ పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద సీసీటీవీ నిఘాను పెంచుతామని ఆమె అన్నారు.
మాములు మహిళల పరిస్థితి ఏంటి...?
మహిళా పోలీస్ అధికారి పరిస్థితే ఇలా ఉంటే మామూలు మహిళల పరిస్థితి ఏంటి..? రాత్రిపూటే కాదు పగలు కూడా వాళ్ళు రోడ్లపై స్వేచ్చగా తిరిగే పరిస్థితి లేదని స్పష్టంగా అర్థమవుతోంది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మహిళలు రోడ్లపైకి వస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మహిళా సిపి కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సంఘటన హైదరాబాద్ లో ఉపాధి కోసం ఇళ్లనుండి బయటకు వచ్చే పేద మహిళలు, సామిన్య ఉద్యోగులు, మధ్యతరగతి స్టూడెంట్స్ లో ఆందోళనను పెంచింది. పోలీసులు, కఠిన శిక్షల భయంతో కాదు... ప్రతి మహిళను తమ తల్లిగానో, చెల్లిగానో, బిడ్డగానో మగాళ్లంతా భావించే రోజే వారికి సంపూర్ణ భద్రత లభించనుంది.

