తెలంగాణ‌లోని ఇంజ‌నీరింగ్ కాలేజీల ఫీజులు పెర‌గ‌నున్నాయా.. అంటే. అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇందుకు సంబంధించి ప్రైవేట్ ఇంజ‌నీరింగ్ కాలేజీలు ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు చేసిన‌ట్లు తెలుస్తున్నాయి. ఇంత‌కీ ఈ ప్ర‌తిపాద‌న ప్ర‌కారం ఏయే కాలేజీలో ఎంత ఫీజులు పెర‌గ‌నున్నాయి.? లాంటి పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం..   

తెలంగాణలోని ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు త్వరలోనే పెరగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, పరిసర జిల్లాల్లో ఉన్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు ఫీజును 100 శాతం వరకు పెంచాలని కోరుతూ ప్రతిపాదనలు చేశాయి. 

ఈ ఫీజు పెంపుపై తుది నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. దీనికి కార‌ణం రేవంత్ రెడ్డి విద్యా శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న విష‌యం తెలిసిందే. మ‌రి రేవంత్ రెడ్డి దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి. 

కాగా తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (TAFRC) కొన్ని ప్రముఖ కాలేజీల ఫీజును ఇలా పెంచాలని సూచించింది. వీటిలో సీబీఐటీ రూ. 1.65 లక్షల నుంచి రూ.2.45 లక్షలకు, ఎమ్‌జీఐటీ రూ.1.60 లక్షల నుంచి రూ.2.45 లక్షలకు, గీతాంజలి రూ.1.20 లక్షల నుంచి రూ.1.55 లక్షలకు, గోకరాజు రంగా రాజు: రూ.1.30 లక్షల నుంచి రూ.1.80 లక్షలకు అలాగే వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి రూ.1.35 లక్షల నుంచి రూ.2.20 లక్షలకు, వాసవి ఇంజినీరింగ్ కాలేజీ: రూ.1.40 లక్షల నుంచి రూ.2.15 లక్షలకు పెంచాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. 

ఇక న‌గ‌రంలోని ప‌లు ఇత‌ర ప్ర‌ముఖ కాలేజీలు 35% నుంచి 65% వరకు పెంపు సిఫార్సు చేశారు. ఈ ఫీజులు 2025–26 విద్యాసంవత్సరం నుంచి మొదలయ్యే తొలి మూడేళ్ల బ్లాక్ పీరియడ్ కోసం వర్తించనున్నాయి. TG EAPCET కౌన్సెలింగ్ మిడ్ జూన్‌లో ప్రారంభం కావడం వల్ల, దానికి ముందు ఫీజు పెంపుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

ఒక‌వేళ ప్ర‌భుత్వం ఫీజు పెంపున‌కు అంగీక‌రిస్తే విద్యార్థుల‌పై ఆర్థిక భారం పెరగనుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి కూడా అదనపు నిధులు అవసరం అవుతాయి. 
అయితే 100 శాతం పెంపు జరగకపోయినా, హైదరాబాద్‌లోని ప్రధాన కాలేజీలకు గణనీయంగా ఫీజు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.