జోహ్రా ఫోటోను చూసి చలించిన పోయిన గంభీర్. నీ కన్నీటిని చూసి ఆ భూమాత కూడా మోయలేదమ్మా.. తన చదువుకు అవసరమైన ఖర్చు అందిస్తానని వెల్లడి.
టీం ఇండియా క్రికెటర్ గౌతం గంభీర్ ఒక విషయంలో చలించిపోయాడు. కాశ్మీరీ చిన్నారి ఏడుస్తున్న ఫొటోను చూసి గంభీర్ ఏడుపు ఆపుకోలేకపోయాడు. ఆ చిన్నారి బాధను ట్విట్టర్ లో పంచుకున్నాడు. దీనికి సంబంధించిన వివరాలివి.
కశ్మీర్ లో సోమవారం అబ్దుల్ రషీద్ అనే ఎఎస్ ఐ మీద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. నిరాయుధుడైన ఆ పోలీసు ఆఫీసర్ రషీద్ గాయాలతో ఆసుప్రతిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అయితే రషీద్ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఆయన కూతురు జోహ్రా తట్టుకోలేక బోరున విలపించింది. ఆ కూతురు ఏడుస్తున్న ఫోటోను దక్షిణ కశ్మీర్ డీఐజీ ట్వీట్ చేశాడు. "నీ ఏడుపు నా గుండెను పిండేస్తోందమ్మా" అని ఆ ట్విట్ లో కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఆ చిన్నారి ఏడుస్తున్న ఫొటో దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. లక్షలాది మంది జోహ్రా ఫోటోను చూసి బాధతో ఓదార్పుతో కామెంట్లను జోడించారు.
ఇప్పుడు ఇదే ఫోటో భారత ఓపెనర్ గౌతమ్ గంభీర్ను చేరింది. ఆ ఫొటో చూసి చలించిపోయిన గంభీర్ భావోద్వేగపూరితంగా ట్వీట్ చేశాడు. ‘జోహ్రా లాలిపాట పాడి నిన్ను నేను నిద్రపుచ్చలేను. కానీ.. నీ కలల్ని నిజం చేసుకునేందుకు నీకు సాయం చేస్తాను. జీవితాంతం నీ చదువు ఖర్చు నేను భరిస్తాను. జోహ్రా నువ్వు కన్నీరు కార్చొద్దు.. బాధతో వచ్చే నీ కన్నీరుని ఈ భూమాత కూడా మోయలేదు. దేశం కోసం ప్రాణాలర్పించిన మీ తండ్రి ఏఎస్ఐ అబ్దుల్ రషీద్కి సెల్యూట్’ అని గంభీర్ వ్యాఖ్యానించారు.
