శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్లతో పట్టుబడ్డ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే
- శంషాబాద్ లో బుల్లెట్ల కలకలం
- వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి వద్ద బుల్లెట్లు లభ్యం
శంషాబాద్ ఎయిర్పోర్టులో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే వద్ద బుల్లెట్లను గుర్తించిన ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఓ ఎమ్మెల్యే వద్ద ఇలా బుల్లెట్లు లభ్యమవడంతో ఎయిర్ పోర్టులో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డి బ్యాంకాక్ కు వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే భద్రతా చర్యల్లో బాగంగా సిబ్బంది ఆయన లగేజిని పరిశీలించారు. అయితే ఓ బ్యాగులో నాలుగు 32లైవ్ బుల్లెట్లను పోలీసులు గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకున్న ఎయిర్పోర్టు సీఐఎస్ఎఫ్ సిబ్బంది వాటిని ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు.
ఈ బుల్లెట్లను తరలించడానికి ప్రయత్నించిన ఎమ్మెల్యే సాయిప్రసాద్ ను పోలీసులు విచారించారు. అయితే బుల్లెట్లకు సంబంధించిన లైసెన్సును ఎమ్మెల్యే పోలీసులకు చూపించడంతో ఆయన్ని వదిలిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.