రెండేళ్లలో లక్ష ఐటీ, లక్ష ఎలక్ట్రిక్ ఉద్యోగాలు
- ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ యత్నం
- రెండేళ్లల్లో లక్ష ఉద్యోగాలు ఇస్తాం
- మంత్రి లోకేష్ వెల్లడి
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది.. ప్రజలను ఆకట్టుకునేందుకు ఏపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగాలను ఆశగా చూపి యువతను తమ వైపు లాక్కునేందుకు యత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే రానున్న రెండు సంవత్సరాలలో లక్ష ఐటీ, లక్ష ఎలక్ట్రిక్ ఉద్యోగాలు ఇస్తామంటూ మంత్రి నారా లోకేష్ ఈ రోజు తెలిపారు.
విజయవాడలోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ను ఈ రోజు రేణిగుంట ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 2 కంపెనీ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా వారు వారి సమస్యలను మంత్రికి తెలియజేశారు. రేణిగుంట ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 2 లో మౌలిక సదుపాయాలు,భూమి కేటాయింపులు, వీలైనంత త్వరగా కల్పించాలి వారు కోరారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజలకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా.. కృషి చేస్తున్నామని..రాబోయే రెండు సంవత్సరాల్లో లక్ష ఐ.టి ఉద్యోగాలు,లక్ష ఎలక్ట్రానిక్ ఉద్యోగాలు కల్పిస్తామని
మంత్రి తెలిపారు. డ్రోన్ ఉపయోగించి ఎప్పటికప్పుడు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 2లో జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తానని ఆయన చెప్పారు.
అంతేకాక రేణిగుంట ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కి నెల రోజుల్లో భూమి కేటాయింపులు పూర్తి చేస్తామని..వీలైనంత త్వరగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.
దేశంలో తయారు అవుతున్న 10 ఫోన్లలో 3 ఫోన్లు ఏపి లొనే తయారు అవుతున్నాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.వివిధ రకాల ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలు ఏపి లో ఏర్పాటు చెయ్యడానికి కావాల్సిన అనువైన వాతావరణం రాష్ట్రంలో ఉందన్నారు.