తిరుచానూర్ లో వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు షురూ
- భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు
- రథమండపం వద్ద ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటు
- ఊంజల్సేవ రద్దు
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 4 వ తేదీ న వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి వీచ్చేయనున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నారు.
వరలక్ష్మీ వ్రతం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్లో అందుబాటులో ఉంచింది. . ఆగస్టు 3వ తేదీన 200 టికెట్లను ఆలయం వద్ద గల కౌంటర్లో విక్రయిస్తారు. వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా ఆస్థానమండపంలో, రథమండపం వద్ద ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటుచేస్తున్నారు. అమ్మవారి ఆలయం, ఆస్థాన మండపం, ఇతర ప్రాంతాలను పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు.
వ్రతాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు తగిన లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆస్థానమండపంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. రెండు రోజులు ముందు నుంచి తిరుచానూరు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో ప్రచార రథాల ద్వారా వరలక్ష్మీ వ్రతం విశిష్టతను తెలియజేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కాగా, వరలక్ష్మీవ్రతం రోజున ఉదయం 3.30 నుంచి 5.00 గంటల వరకు మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం, ఉదయం 10.00 నుంచి 12.00 గంటల వరకు ఆస్థానమండపంలో వరలక్ష్మీవ్రతం, సాయంత్రం 6.00 గంటలకు స్వర్ణరథం ఊరేగింపు నిర్వహిస్తారు. భక్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనవచ్చు. ఈ కారణంగా అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, ఊంజల్సేవలను రద్దు చేశారు.