చదువుల ఒత్తిడి తట్టుకోలేక అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య (వీడియో)
- చదువుల ఒత్తిడి తట్టుకోలేక అక్కాచెల్లె ళ్ల ఆత్మహత్య
- ఎల్ బి నగర్ లో విషాదం
చదువుల ఒత్తిడికి మరో ఇద్దరు విద్యార్థినులు బలయ్యారు. ఒత్తిడిని తట్టుకోలేక 10 వ తరగతి చదువుతున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య కు పాల్పడిన సంఘటన ఎల్బీనగర్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఎల్బి నగర్ లోని టిఎన్ఆర్ వైష్ణవి అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న అక్కాచెల్లెళ్లు ఇవాళ ఉదయం అపార్ట్ మెంట్ లోని అంతస్తునుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఇద్దరు సోదరీమణులు ప్రస్తుతం అక్షరా ఇంటర్నేషనల్ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్నారు. అయితే ఈ విద్యాసంస్థ చదువులు, ర్యాంకుల పేరుతో పెట్టిన ఒత్తిడితోనే తమ కూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాధు చేశారు. దీంతో ఎల్బి నగర్ లోని స్కూల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
విద్యార్థినుల ఆత్మహత్యల విషయం తెలిసిన పలు విద్యార్థి సంఘాలు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగాయి. అలాగే ఈ ఆత్మహత్యపై స్పందించిన బాలల హక్కుల సంఘం విద్యా సంస్థల్లో పిల్లల ను మార్కులు, ర్యాంకుల కోసం వేధించకుండా విద్యా శాఖ చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ ఇద్దరు అమ్మాయిల మృతి పై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది.
వీడియో