కామారెడ్డి జిల్లాలో పిడుగు పాటు ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు
కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం బసన్నపల్లిలో విషాదం చోటు చేసుకుంది. మోటాట్ పల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం శుభకార్యంకోసం గుడికి వెళ్లగా అనుకోని రీతిలో మృత్యువు వెంటాడి ఇద్దరిని బలి తీసుకుంది.
కుటుంబసభ్యులంతా కలిసి ఓ చిన్నారి పుట్టువెంట్రుకలు తీసేందుకు బసన్నపల్లిలోని కొయ్యగుట్ట దేవాలయానికి వెళ్లారు. అయితే భారీ వర్షం కారణంగా వారంతా దేవాలయం ప్రాంగణంలోని చెట్టు కింద నిల్చున్నారు. అదే సమయంలో అక్కడ పిడుగుపాటు సంభవించడంతో రాజారెడ్డి, భిక్షపతి అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అలాగే సరితా, కొండల్ రెడ్డి అనే వ్యక్తులకు తీవ్ర గాయాలవగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు ప్రమాదం బారిన పడటంతో మోటాట్ పల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Add Asianetnews Telugu as a Preferred Source

