రేవంత్ పై గువ్వల ఫైర్
- రేవంత్ రెడ్డి పై విమర్శల వర్షం కురిపించిన గువ్వల
- తమ పార్టీ నాయకులను విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరిక
టీఆర్ఎస్ పార్టీ నాయకులను తీవ్ర పదజాలంతో తిడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి పై టీఆరెస్ ఎమ్మెల్య్ గువ్వల బాలరాజు ఫైర్ అయ్యారు. ఇవాళ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ ఏర్పాటుచేసిన ఆయన రేవంత్ వ్యవహార శైలిపై మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాష, పదజాలం, ఆ విధానం బాగాలేదని, దీన్ని సభ్య సమాజం ఆమోదించదని బాలరాజు తెలిపారు. ఇటువంటి నాయకుల వలన ప్రజల్లో మీ పార్టే పలుచబడుతోందని, దీన్ని గమనించాలని కాంగ్రెస్ పార్టీకి సూచించారు. ప్రధాని మోడీ పై అనుచితంగా మాట్లాడిన మణిశంకర్ అయ్యర్ ను సస్పెండ్ చేసినట్లే, రేవంత్ ను కూడా సస్పెండ్ చేయాలని సూచించారు.
తమ గురించి గానీ, తమ నాయకుల గురించి మాట్లాడే హక్కు రేవంత్ కు లేదని బాలరాజు హెచ్చరించారు. తమ అవినీతి గురించి మాట్లాడే ముందు నీ ఓటుకు నోటు వ్యవహారం గురించి మాట్లాడాలని ఎద్దేవా చేశారు. అలాగే తానో సత్యపురుషుడిగా చెప్పుకునే రేవంత్ కు తారాచౌదరీ తో ఉన్న సంబంధమేమిటో ప్రజలకు తెలపాలన్నారు. స్టీఫెన్ సన్ ను కొనడానికి ప్రయత్నించినపుడే ప్రజలకు రేవంత్ నిజాయితీ ఏంటో అర్థమైందన్నారు. ఇలాంటి చీడ పురుగులను ప్రజలు నమ్మరని బాలరాజు విమర్శించారు.
అలాగే రేవంత్ తన విమర్శల్లో అనేక కులాలను అవమానించేలా మాట్లాడుతున్నాడని తెలిపారు. నిన్న మంత్రి లక్ష్మారెడ్డిని విమర్శిస్తూ పిచ్చ కుంట్ల కులాన్ని కించపరిచారని, ఇలా వారి కులాన్ని అంటే ఉరుకోమన్నారు.
తన నియోజకవర్గం అచ్చంపేటలో కొందరు భజన పరులను పోగేసుకుని దోచుకున్న డబ్బులు పంచిపెట్టి రేవంత్ సభలు నిర్వహిస్తున్నాడని విమర్శించారు. "ఈ ప్రెస్ మీట్ నుంచి రేవంత్ గానికి సవాల్ విసురుతున్నా, నీ రాజీనామా ఆమోదం చేసుకో నేను కూడా చేస్తా అప్పుడు చూద్దాం ఎవడు గెలుస్తాడో" అంటూ బాలరాజు విరుచుకుపడ్డారు. ఎన్ని పార్టీలు ఏకమైనా టీఆర్ఎస్ ను ఓడించడం సాధ్యం కాదని అన్నారు.
"ఒక మంత్రిపై సంస్కార హీనంగా రేవంత్ మాట్లాడిండు... ఇలా బాధ్యతాయుత పదవుల్లోని వారిని విమర్శిస్తున్న రేవంత్ ను రాజకీయాల నుంచి, కుదిరితే సమాజం నుంచి వెలి వేయాలి" అన్నారు.
ఇలాంటి వాళ్లను చూసే యువత రాజకీయాల్లోకి రావాలంటే భయపడుతున్నారని ఎమ్మెల్యే బాలరాజు విమర్శించారు.