రెచ్చిపోయిన నాగోల్ టీఆర్ఎస్ కార్పోరేటర్ అనుచరులు (వీడియో)
- నాగోల్ స్థానిక టీఆర్ఎస్ కార్పోరేటర్ అనుచరుల వీరంగం
- అర్థరాత్రి ఓ హోటల్ యజమానిపై దాడి
ఎల్బీనగర్ నాగోల్ లో స్థానిక కార్పోరేటర్ చెరకు సంగీత భర్త ప్రశాంత్ గౌడ్ అనుచరులమంటూ కొందరు దుండగులు వీరంగం సృష్టించారు. అర్ధరాత్రి ఓ హోటల్ యజమానిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపర్చారు. దీంతో తీవ్ర గాయాలతో అతడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ దాడికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నాగోల్ ప్రాంతంలో సయ్యద్ అలీ రజా అనే వ్యక్తి 'లక్కీ' పేరుతో ఓ హోటల్ నడిపిస్తున్నాడు. అతడు నిన్న అర్థరాత్రి సమయంలో హోటల్ ని క్లోజ్ చేస్తుండగా కొందరు దుండగులు అందులోకి ప్రవేశించారు. తమకు బిర్యానీ కావాలంటూ హోటల్ యజమాని రజాను అడిగారు. అయితే కౌంటర్ క్లోజ్ చేశామని, బిర్యాని కూడా అయిపోయిందని అతడు వారికి చెప్పాడు. దీంతో కోపోద్రిక్తులైన దుండగులు తాము స్థానిక కార్పోరేటర్ భర్త అనుచరులం, మాకే బిర్యానీ లేదంటావా అంటూ దౌర్జన్యానికి దిగారు. యజమాని రజా తలను పగులగొట్టడంతో పాటు, హోటల్ లోని వస్తువులను ద్వంసం చేశారు. ఈ దాడిలో బాధితుడి తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. గాయాలపాలైన బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.