వరంగల్ జిల్లా మేడారంలో ఉద్రిక్తత
- మేడారంలో ఆదివాసీల ఆందోళన
- మంత్రి చందూలాల్ కొడుకును అడ్డుకున్న ఆదివాసీలు
ఆదివాసీ- లంబాడీల వివాదం మేడారంకు పాకింది. మేడారం జాతర ట్రస్ట్ బోర్డులో వున్న ఇద్దరు లంబాడీలను తొలగించి ఆదివాసీలను నియమించాలని ఆదివాసి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే వీరి డిమాండ్ ను తెలంగాణ సర్కారు పట్టించుకోక పోవడంతో ఆందోళనను ఉదృతం చేశారు. తెలంగాణ సర్కార్ నియమించిన 11 మంది సభ్యులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేసేందుకు మేడారం దేవాదాయ కార్యాలయానికి వచ్చారు. వారిని ఆదివాసీలు అడ్డుకున్నారు.
అయితే ఇదే సమయంలో దేవాదాయ కార్యాలయంలోకి వెళుతున్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్ వాహనంపై కూడా ఆదివాసులు దాడి చేశారు. ఈ దాడిలో ప్రహ్లాద్ కారుతో పాటు మొత్తం 15 కార్లు ద్వంసమయ్యాయి.
భారీ సంఖ్యలో కార్యాలయం వద్దకు చేరుకున్న ఆదివాసులు ఒక్కసారిగా వాహనాలను అడ్డుకోవడంతో పాటు రాళ్లు విసురుతూ విద్వంసం సృష్టించారు. ఊహించని పరిణామంతో కంగుతిన్న పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేసినా వెనక్కి తగ్గకుండా వాహనాలపై దాడులు చేస్తూ, వాహనాలకు నిప్పులు పెట్టారు. దీంతో అక్కడ మంటలు చెలరేగి పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. వీటితో పాటు కార్యాలయంలో ఫర్నీచర్, రికార్డులు దగ్ధమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు బలగాలను మోహరించారు. సమాచారం అందుకున్న ములుగు డీఎస్పీ రాఘవేంద్రారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ఆదివాసీలతో చర్చలు జరుపుతున్నారు.