తెలంగాణలో భారీ ఎన్ కౌంటర్ - 12 మంది మావోయిస్టుల మృతి (వీడియో)
- తెలంగాణ-చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్
- కాల్పుల్లో 12 మంది మావోల మృతి
- ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఇవాళ ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలకు, మావోయిస్టులకు మద్య జరిగిన హోరాహోరీ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులతో పాటు ఓ పోలీస్ మృతి చెందారు. మృతుల్లో మావోయిస్ట్ పార్టీ తెలంగాణ సెక్రటరీ హరిభూషణ్, మరో కీలక నేత బడే చొక్కారావు మృతి చెందినట్లు సమాచారం. అలాగే కేంద్ర కమిటీ సభ్యుడు అజాద్ ఈ కాల్పుల్లో గాయపడినట్లు సమాచారం.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం చర్ల మండలం తొండపాల్ సమీపంలో మావోయిస్టులు సమావేశమైనట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో మావోయిస్టులను ఏరివేయడానికి పనిచేస్తున్న గ్రేహౌండ్స్-ఈవోఎస్ బలగాలకు ఉన్నతాధికారులు సమాచారం అందించారు. దీంతో అటువైపు కదిలిన బలగాల రాకను గుర్తించిన మావోలు కాల్పులు మొదలుపెట్టారు. దీంతో పోలీసు బలగాలు కూడా ఎదురుకాల్పులకు దిగాయి. ఇరువురి మధ్య భీకరంగా సాగిన కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు, ఓ పోలీస్ చనిపోయారు. మృతిచెందిన మావోయిస్టుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. మృతిచెందిన పోలీస్ ను సుశీల్ గా గుర్తించారు. ఇతడు వికారాబాద్ జిల్లాకు చెందిన గ్రేహౌడ్స్ కానిస్టేబుల్.
ఘటనా స్థలి నుంచి పోలీసులు భారీగా ఆయుధాలు, స్కానర్, ల్యాప్ట్యాప్ లతో పాటు రూ.41వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వీడియో