టిటిడి ఛైర్మన్ గా సుధాకర్ యాదవ్ ఫైల్ కదిలిందా?
- టిటిడి పాలకవర్గ నియామకంపై మళ్లీ కదలిక
- పుట్టా సుధాకర్ యాదవ్ పేరు ఖరారైనట్లేనని సమాచారం
- సంక్రాంతి తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం
తిరుమల తిరుపతి దేవస్థాన నూతన పాలకవర్గం ఏర్పాటు దాదాపై ఖరారైనట్లు సమాచారం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక నిర్ణయాలన్ని పూర్తయినట్లు, అధికారికంగా ఉత్తర్వులు రావడమే తరువాయి అని ప్రభుత్వ పెద్దల నుండి సంకేతాలు అందుతున్నాయి. ఇంతకు ముందు ప్రచారం జరిగినట్లే కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం బిసి నేత పుట్టా సుధాకర్ యాదవ్ నే టిటిడి చైర్మన్ గా నియమించనున్నారు. ఈ మేరకు ఆయన నియామకానికి, పాలవర్గ సభ్యుల నియామకానికి సంబంధించి సంక్రాంతి తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు సీఎం సన్నిహిత వర్గాల నుండి సమాచారం అందుతోంది.
ప్రతిష్టాత్మకమైన టీటిడి అధ్యక్ష పదవిలో ఎలాంటి మచ్చ లేని వ్యక్తిని కూర్చొబెట్టాలని భావించిన టిడిపి ప్రభుత్వం వివాద రహితుడు, కడప జిల్లా వాసి సుధాకర్ యాదవ్ పేరును ఖరారు చేసింది. ఇందుకు సంబంధించి మూడు నెలల క్రితమే ఈయన నియామకం ఖాయమే అన్నట్లు ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా అతడు క్రైస్తవ మత ప్రచారానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నాడనే ప్రచారం జరగడంతో ఈ నియామకం పై ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. ఇదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆయన పొందిన కాంట్రాక్టులు కూడా వివాదమయ్యాయి. రాష్ట్రమంత్రి అయ్యన్నపాత్రుడు సుధాకర్ వియ్యంకుడు. ఆయన కెసిఆర్ సంప్రదించి ఈ కాంట్రాక్టులు ఇప్పించారని, కాంట్రాక్టులు ఇచ్చినుందుకే అయన్నపాత్రుడు కెసిఆర్ ప్రభుత్వాన్ని పొగడటం ప్రారంభించారని ఆ మధ్య పెద్ద చర్చ జరిగింది. ఇవన్నీ ఆయన నియామకం వాయదా పడేందుకు కారణమయింది. ఇపుడు వివాదాలు సద్దుమణిగాయి. సుధాకర్ యాదవ్ వ్యవహార శైలి, సామాజిక నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలీంచిన ప్రభుత్వం, ఇతడి నియామకంతో ఎలాంటి ఇబ్బందులు రావని నిర్థారణకు వచ్చిందని తెలిసింది. దీంతో అతడి సారథ్యంలో పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలని తుది నిర్ణయం తీసుకున్నట్లు అమరావతిలో వార్తలు గుప్పు మన్నాయి.
ఈ పాలక వర్గంలో అధికార టిడిపి పార్టీ సభ్యులతో పాటు మిత్రపక్ష బిజెపి సభ్యులకు స్థానం లభించనుందని చెబుతున్నారు. ఇలా సమతూకంతో టిటిడి పాలకవర్గాన్ని నియమించి టిటిడి పాలనను మెరుగుపర్చా లని భావిస్తోంది ప్రభుత్వం.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతరంగమేమిటో ఎక్కడా ఆయన వెల్లడించడం లేదు. అందుకే ఇంతకు ముందు మాదిరిగానే ఈ నియామకం కూడా అట కకెక్కుతుందా? లేక ప్రాసెస్ సజావుగా సాగి పాలకవర్గం కొలువుతీరుతుందా? వేచి చూడాలి మరి.