ఈ మహిళా సర్పంచ్ కుటుంబాన్ని గ్రామ పెద్దలు ఏం చేశారంటే
- నిజామాబాద్ లో ఓ దళిత సర్పంచ్ పై గ్రామ బహిష్కరణ
- హెచ్చార్సీని ఆశ్రయించిన సర్పంచ్
- నిజామాబాద్ సీపీకి నోటీసులు జారీ చేసిన హెచ్చార్సీ
స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా, ప్రపంచం మొత్తం ఆదునిక యుగం వైపు పరుగులు పెట్టినా తెలంగాణ లో మాత్రం ఇంకా దొరల పాలన కొనసాగుతోంది. ఎంతలా అంటే గ్రామ ప్రజలందరు కలిసి ఎన్నుకున్న సర్పంచ్ ను కూడా గ్రామ బహిష్కరణ విదించేంతగా సాగుతోంది దొరల అరాచకం. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బుస్సాపూర్ లో చోటుచేసుకుంది. తాను మహిళలని కూడా చూడాకుండా దళితురాలినవడంతోనే గ్రామ పెద్దలు తన కుటుంబంపై గ్రామ బహిష్కరణ విధించారని ఈ మహిళా సర్పంచ్ పేర్కొంటుంది. ఇంతకు జరిగిన విషయమేంటో తెలుసుకుందాం.
నిజామాబాద్ జిల్లా బుస్సాపూర్ గ్రామ సర్పంచ్ గా మమత అనే దళిత మహిళ పనిచేస్తోంది. అయితే తన భర్తకు అత్తామామల నుండి వారసత్వంగా సంక్రమించిన భూమి ఉందని, దీనిపై కన్నేసిన కొందరు గ్రామ పెద్దలు ఈ భూమి తమదంటూ దౌర్జన్యానికి దిగుతున్నారని మమత వాపోయింది. ఈ భూమికి సంభందించిన డాక్యుమెంట్పై సంతకాలు చేయాలంటూ తనపై ఒత్తిడి చేశారని, దీనికి ఒప్పుకోకపోడంతో తన కుటుంబంపై గ్రామ బహిష్కరణ విధించారని ఆవేధన వ్యక్తం చేశారు. అంతే కాకుండా తన కుటుంబంతో ఎవరైనా మాట్లాడినా 5 వేల జరిమానా చెల్లించాలని తీర్మానించారని పేర్కొన్నారు.
దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అందువల్లే హెచ్చార్పీని ఆశ్రయించినట్లు మమత తెలిపింది. తాము దళితులమయినందుకే తమపై చిన్నచూపు చూస్తున్నారని, ఇదే విషయాన్ని హెచ్ఆర్సీ కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సర్పంచ్ మమత కుటుంబం తెలిపింది. బాధిత సర్పంచ్ ఫిర్యాధుపై స్పందించిన హెచ్చార్సీ ఈ ఘటనపై ఎప్రిల్ 23 లోగా నివేదిక సమర్పించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది.