నోట్లు కాదని..కాయిన్స్ మాత్రమే దొంగిలించారు..!
- కోట్లలో నోట్లు ఉంటే చిల్లర మాత్రమే తీసుకువెళ్లారు.
- 46 పాలిథిన్ సంచుల్లో ఈ నగదు తీసుకువెళ్లారు
- రెండు గంటలు బ్యాంకులోనే ఉన్నారు
ఎదైనా బ్యాంకులో దొంగతనం జరిగిందంటే.. దాదాపుగా నగలు, కరన్సీ నోట్లను దొంగలు దోచుకువెళతారు. కానీ.. చిల్లర నాణేలు తీసుకువెళ్లరు. ఎందుకంటే వాటిని మోసుకు వెళ్లడం కష్టం కాబట్టి. కానీ దేశరాజధాని ఢిల్లీలోని ఓ బ్యాంకులో మాత్రం దొంగలు కేవలం కాయిన్స్ మాత్రమే తీసుకువెళ్లారు.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని సిండికేట్ బ్యాంకులో ఇటీవల దొంగతనం జరిగింది. ముగ్గురు దొంగలు దొంగతనానికి పాల్పడి.. రూ.2.3లక్షల విలువ చేసే రూ.5,రూ.10 కాయిన్స్ ఎత్తుకు వెళ్లారు. రెండు గంటలపాటు బ్యాంకులో ఉండి 46 పాలిథిన్ సంచుల్లో ఈ నగదు తీసుకువెళ్లారు. వారిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. వాళ్లు కేవలం చిల్లర డబ్బులనే దొంగతనం చేయడానికి గల కారణం తెలుసుకొని పోలీసులు విస్తు పోయారు. దేశంలో ఇటీవల పెద్ద నోట్లను రద్దు చేసి.. రూ.2వేల నోటును ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ నోటులో జీపీఎస్ ని అమర్చారని.. దాంతో వాటిని ట్రేస్ చేయవచ్చని కొంతకాలం ప్రచారం జరిగింది. అది నిజమని నమ్మిన ఈ దొంగలు.. నోట్లను దొంగతనం చేస్తే పోలీసులకు దొరికిపోతామని.. కాయిన్స్ దొంగిలించినట్లు చెప్పారు.