ఉప రాష్ట్రపతి వెంకయ్య దృష్టికి రాయలసీమ సాగునీటి సమస్యలు
- రాయలసీమ సాగునీటి సమస్యలపై ఉపరాష్ట్రపతిని కలిసిన నేతలు
- కేంద్ర ప్రభుత్వం తరపున సాయం చేయాలని వినతి
- సానుకూలంగా స్పందించిన ఉపరాష్ట్రపతి
హైదరాబాద్ : అఖిల భారత రైతు సంఘాల నాయకులు చెంగల్ రెడ్డి, ఉష, సత్య నారాయణ రెడ్డి, బొజ్జా దశరథ రామిరెడ్డి భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడును సోమవారం హైదరాబాదులోని రాజ్భవన్లో కలిశారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి తో దేశవ్యాప్తంగా ఉన్న రైతు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్ళారు. కేంద్ర ప్రభుత్వం రైతుల క్షేమం కోసం ప్రవేశ పెట్టిన అనేక విషయాలను ప్రస్తావించారు. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన పథకంలో కరువు పీడిత ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు ఈ సమస్యలపై ఇతర రైతు సమస్యలపై ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
వెంకయ్యనాయుడుతో అనేక రైతు సమస్యలతో పాటు రాయలసీమ సమస్యలను కూడా ప్రధానంగా చర్చించడం జరిగింది. కరువు పీడిత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మిగులు జలాలపైన ఆధారపడి నిర్మిస్తున్న ప్రాజెక్టుల నీటి కేటాయింపుల గురించి, రాయలసీమకు జరుగుతున్న అన్యాయాల గురించి చర్చించారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు బొజ్జా దశరథరామిరెడ్డి రాయసీమ ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులను వివరిస్తూ సవివరమైన వినతి పత్రాన్ని కూడా వెంకయ్యనాయుడుకి అంందజేశారు. దీనిపై స్పందించిన ఆయన ఈ ప్రాజెక్టులను రాష్ట్ర విభజన బిల్లు లో చేర్చడంలో క్రియాశీలక పాత్ర వహించిన విషయాన్నిగుర్తుచేశారు. రాష్ట్ర విభజన బిల్లులో ఈ అంశాలను చేర్చినప్పటికి వాటిని సెక్షన్ 89లో చేర్చాల్సి ఉండగా, అది పొందుపర్చలేదని దీని వల్ల రాయలసీమ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులో తలెత్తుతున్న ఇబ్బందులను ఆయనకు వివరించారు. రాయలసీమకు ఆశించిన ప్రయోజనం చేకూరాలంటే రాష్ట్ర విభజన చట్టం లో చేయాల్సిన మార్పులపై ఒక సమగ్ర పత్రాన్ని కూడా బొజ్జా దశరథరామిరెడ్డి వెంకయ్య నాయుడికి అందజేశారు. తన దృష్టికి తెచ్చిన అంశాలను పరిశీలించి తగు నివేదిక ఇవ్వాలని ఉప రాష్ట్రపతి కార్యాలయ కార్యదర్శి ఐవి. సుబ్బారావుకు బాధ్యతలను అప్పిగించారు. ఉపరాష్ట్రపతి.
రాష్ట్ర పతి చేతుల్లో వదరుబోతు...
సుమారు వందేళ్ళ కింద అంటే 1917-18 మధ్య కాలంలో కరప్రతాల సంకలంగా ప్రచురించిన వదరుబోతు పనుర్ముద్రణ కాపీని ఉపరాష్ట్ర పతికి రాయలసీమ ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు అందజేశారు. అనంతపురం పూర్వం విద్యార్థులు సామాజక అంశాలపై ఆనాడు ప్రచురించిన ఈ వదరుబోతు పుస్తకాన్ని ఇటీవల కేంద్ర యువ సాహితీ పు రస్కార గ్రహీత డాక్టర్ అప్పిరెడ్డి హరినాధ రెడ్డి సంపాదకత్వంలో వెలువడింది.