రేవంత్- కవిత వ్యాపారాలు చేసారా ?
- తెలంగాణా సిఎం కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితతో టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ కు వ్యాపార సంబంధాలు ఉండేవా?
- అవుననే అంటున్నారు పయ్యావుల కేశవ్.
- గతంలో రేవంతే కెసిఆర్ కూతురుతో వ్యాపారం చేసింది నిజం కాదా? అంటూ నిలదీసారు.
తెలంగాణా సిఎం కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితతో టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ కు వ్యాపార సంబంధాలు ఉండేవా? అవుననే అంటున్నారు పయ్యావుల కేశవ్. కెసిఆర్ తో టచ్ లో ఉండటం ద్వారా ఏపి టిడిపి నేతలు యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత, పయ్యావు కేశవ్ ఆర్ధికంగా లబ్దిపొందారంటూ వారం క్రింత రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సోమవారం పయ్యావుల మీడియాతో మాట్లాడారు.
రేవంత్ గురించి పయ్యావుల మాట్లాడుతూ, గతంలో రేవంతే కెసిఆర్ కూతురుతో వ్యాపారం చేసింది నిజం కాదా? అంటూ నిలదీసారు. అయితే, సన్నిహితుల ఒత్తిడితోనే రేవంత్ తర్వాత భాగస్వామ్యం నుండి తప్పుకున్న విషయాన్ని రేవంత్ మరచిపోయారా అంటూ నిలదీసారు.
తనకు తెలంగాణాలో ఎక్కడా వ్యాపారాలు లేవన్న పయ్యావుల కెసిఆర్ తో కూడా ఎటువంటి సంబంధాలు లేవన్నారు. హైదరాబాద్ లో తనకు ప్లాటు కానీ ఫ్లాట్లు కూడా లేవన్నారు. తన మేనల్లుడు మరికొందరితో కలిసి మద్యం వ్యాపారం చేస్తున్నది నిజమేనంటూ అంగీకరిచారు.
అయితే, అందులో పరిటాల సునీత బంధువులున్నదీ లేనిదే తనకు తెలియదని చెప్పారు. ఇతరుల వ్యాపారాల గురించి మాట్లాడేకంటే ముందు రేవంత్ తన వ్యాపారాల గురించి చూసుకుంటే బాగుంటుందని కూడా ఓ ఉచిత సలహా పడేసారు.
మొత్తానికి వారం క్రితం రేవంత్ బయటపెట్టిన కెసిఆర్- ఏపి టిడిపి నేతల సంబంధాల గుట్టు ప్రకంపనలు సృష్టిస్తోంది. దాని పర్యవసానం ఈరోజు పయ్యావుల మీడియా సమావేశంలో బయటపడింది. మొన్నటి వరకూ కెసిఆర్ తో యనమల, పరిటాల, పయ్యావుల సంబందాల గురించి ఎవరికీ పెద్దగా తెలీవు.
అదే విధంగా ఈరోజు పయ్యావుల మాట్లాడుతూ గతంలో రేవంత్-కవితలు కలిసి వ్యాపారాలు చేసిన విషయం కూడా చాలామందికి తెలీదు. అటువంటిది ఒకరి గుట్టు మరొకరు బయటపెట్టుకుంటున్నారు. మొత్తం మీద టిడిపిలో మొదలైన అంతః కలహాలతో మొత్తం పార్టీ పరువే బజారున పడుతోందన్నది మాత్రం వాస్తవం.