పాక్ ప్రధానిపై అనర్హత వేటు
- పదవి నుంచి ఆయన తప్పుకోవాల్సిందిగా సుప్రీం కోర్టు తీర్పు
- ప్రధాని రేసులో షరీఫ్ సోదరుడు షెహ్బజ్ షరీఫ్
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పై అనర్హత వేటు పడింది. ప్రధాని పదవి నుంచి ఆయన తక్షణమే తప్పుకోవాల్సిందిగా సుప్రీం కోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది.
పనామా గేట్ కుంభకోణం కేసులో పాక్ ప్రధాని నవాజ్షరీఫ్, ఆయన కుటుంబసభ్యులు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. 1990ల్లో షరీఫ్ ప్రధానిగా ఉన్నప్పుడు లండన్లో ఆస్తులు కొనుగోలు చేసేందుకు గానూ అక్రమ నగదు చెలామణీకి పాల్పడ్డారని.. వివిధ కంపెనీలను అడ్డుపెట్టుకుని లండన్లో భారీగా ఆస్తులు కూడపెట్టారని పనామా పత్రికలో ప్రచురితమయ్యాయి.. దీనిపై విచారణ జరపాలని ప్రతిపక్ష నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ కేసులో గతవారం న్యాయస్థానం విచారణ చేపట్టగా... షరీఫ్కు వ్యతిరేకంగా ఆధారాలు వెలువడ్డాయి.కాగా..ఐదుగురు జడ్జిలతో కూడిన న్యాయస్థానం.. నేడు షరీఫ్ను అనర్హుడిగా ప్రకటిస్తూ.. సంచలన తీర్పు వెలువరించింది. దీంతో పాక్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తదుపరి ప్రధాని ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రధాని రేసులో షరీఫ్ సోదరుడు షెహ్బజ్ షరీఫ్, దేశ రక్షణమంత్రిగా ఉన్న ఖవజా అసిఫ్లు ఉన్నారు.