తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను ఆపాలంటూ నిర్ణయం అటవీ అనుమతులు పొందాలని సూచన

తెలంగాణ ప్రభుత్వానికి గ్రీన్ ట్రిబ్యూనల్ షాక్ ఇచ్చింది. కేసిఆర్ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా, చాలెంజ్ గా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు తక్షణమే ఆపాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది.
అనుమతులు లేకుండా అటవీ భూముల్లో నిర్మాణాలు చేపడుతున్నారన్న ఆరోపణలు తీవ్రమైన నేపథ్యంలో నిర్వాసితుల తరుపున పోరాటం చేస్తున్న హయతుద్దిన్ అనే వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ లో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే కాళేశ్వరం పనులు ఆపాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఇది ప్రస్తుతం ఇది తాగునీటి ప్రాజెక్ట్ మాత్రమే అని సాగునీటి ప్రాజెక్టుగా మార్చే లోపు పర్యావరణ, అటవీ అనుమతులు తీసుకుంటామని తెలంగాణ సర్కారు గ్రీన్ ట్రిబ్యూనల్ ముందు వాదించింది. 
కానీ తెలంగాణ సర్కారు వాదనలతో ట్రిబ్యూనల్ ఏకీభవించలేదు. అన్ని అనుమతులు వచ్చే వరకు పనులు నిలిపివేయాలని ఎన్జీటి ఉత్తర్వులు ఇచ్చింది. 3000 ఎకరాల అటవీ భూమిలో పనులు జరుగుతున్నట్లు పేర్కొన్న పిటిషనర్ ట్రిబ్యూనల్ దృష్టికి తీసుకుపోయారు. 
మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు సామదాన బేధ దండోపాయాలను ఉపయోగిస్తున్న తెలంగాణ సర్కారుకు గ్రీన్ ట్రిబ్యూనల్ రూపంలో పెద్ద అడ్డంకి ఎదురైంది. మరి ఈ అడ్డంకిని ఎప్పటిలోగా సర్కారు పరిష్కరించుకుంటుందో చూడాల్సి ఉంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred