ఆన్ లైన్ గేమ్ ప్రాణాలు తీసింది..!
- బ్లూ వేల్ గేమ్ ఆడుతూ బాలుడు ఆత్మహత్య
- ఈ గేమ్ ఆడుతూ విదేశాల్లో పలువురు మృతి
- భారత్ లో ఇది తొలిసారి
ఆన్ లైన్ గేమ్ ఓ బాలుడి ప్రాణాలు బలిగొంది. ఆట ఆడుతూ బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళితే.. ముంబయిలోని అంధేరీ ప్రాంతానికి చెందిన 14 సంవత్సరాల శనివారం ‘బ్లూవేల్’ అనే ఆన్లైన్ గేమ్ ఆడుతూ కూర్చున్నాడు. బ్లూవేల్.. ఓ అండర్గ్రౌండ్ ఆన్లైన్ గేమ్. ఈ గేమ్లో మొత్తం 49 టాస్క్ లు ఉంటాయి. టాస్క్ పూర్తి చేసి వాటి ఫొటోలు తీసి ఆ గేమ్ లో పోస్ట్ చేస్తుండాలి.
బాలుడు గేమ్ ఆడుతుండగా భవనంపై నుంచి దూకాలని టాస్క్ వచ్చింది. టాస్క్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో బాలుడు భవనంపై నుంచి దూకేశాడు. దీంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు చెప్పారు.
.కాగా..ఈ బ్లూవేల్ రష్యాకు చెందిన ఆన్లైన్ గేమ్. ఈ గేమ్ ఆడుతూ చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని.. దీనిని నిర్వహించే వ్యక్తిని రష్యా పోలీసులు అరెస్టు చేశారు. ఈ గేమ్ ఆడుతూ చాలా దేశాల్లో ఎందరో తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ భారత్లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి.