ఈ ముంబై పోలీస్ నిజమైన హీరో (వీడియో)
- ముంబై అగ్నిప్రమాదంలో బాధితులను కాపాడిన కానిస్టేబుల్
- తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సహాయ చర్యలు
- అతడ్ని ప్రశంసించిన ముంబై పోలీస్ కమీషనర్
అది కమలామిల్స్ ప్రాంగణం. అందులోని రెస్టారెంట్ లో ఓ యువతి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. అందరు అతిథులు హాజరయ్యారు. పుట్టినరోజు వేడుకలు ప్రారంభమైన కొద్ది సేపటికే ఆ రెస్టారెంట్ నుండి హాహాకారాలు మొదలయ్యాయి. అగ్నిప్రమాదం సంభవించి ఆ పార్టీ లో పాల్గొన్న వారంతా మంటల్లో చిక్కుకున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అయితే అందులోని ఓ కానిస్టేబుల్ మాత్రం తన ప్రాణాలకు తెగించి మరీ 8 మంది మహిళల ప్రాణాలను కాపాడి హీరో అయ్యాడు. అతడే సుదర్శన్ శివాజీ షిండే.
ఈ దుర్ఘటన గురించి సుదర్శన్ మాట్లాడుతూ... రాత్రి సమయంలో తాను డ్యూటీలో ఉండగా ఈప్రమాదం గురించి సమాచారం అందింది. దీంతదో తాను ఆలస్యం చేయకుండా తనకు అందుబాటులో ఉన్న బృందంతో కలిసి ప్రమాద స్థలానికి చేరుకున్నాను. అప్పటికే అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మంటలు అదుపులోకి రాకుండా ఎగిసిపడుతున్నాయి. ఆ మంటల్లో చిక్కుకున్న వారి హాహాకారాలు నాకు వినిపించాయి. దీంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగి మంటలను సైతం లెక్కచేయకుండా లోపల చిక్కుకున్న బాధితులను సాధ్యమైనంత మేర బయటకు తీసుకొచ్చాం. అయితే మరికొంతమంది ఈ పొగతో ఊపిరాడని స్థితిలో స్పృహ కోల్పోయి పడి ఉన్నారు. వారిని తాము భుజాలపై ఎత్తుకుని బయటకు తీసుకువచ్చాం. వారిని కాపాడటమే తమ కర్తవ్యం భావించి తమ ప్రాణాలను కూడా లెక్కచేయలేమంటూ సుదర్శన్ భావోద్వేంగంగా మాట్లాడాడు. ఇలా అతడు 8 మందిని తన భుజాలపై మోస్తూ బయటకు తీసుకువచ్చి కాపాడాడు. కానీ ఈ ప్రమాదంలో 14 మంది చనిపోవడం తనను ఎంతగానో బాధించిందని, వారిని కాపాడలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.
అయితే ఈ ప్రమాద సమయంలో అతడు మహిళను భుజాన మోస్తూ కాపాడుతున్న ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అతడు తన వృత్తికి వంద శాతం న్యాయం చేశాడంటూ సోషల్ మీడియాలో పొగడ్తలు వెల్లువెత్తాయి. అలాగే అతని పనితీరుకు మెచ్చిన ముంబై పోలీస్ కమిషనర్ దత్తాత్రేయ పడ్సల్గికర్, మేయర్ విశ్వనాథ్ మహదేశ్వర్లు శివాజీని సన్మానించారు. ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు.
కానిస్టేబుల్ సుదర్శన్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ రిపబ్లికన్ టీవి వారి సౌజన్యంతో