నిజామాబాద్ లో సిటీ సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలిపిన మంత్రి అలాగే జిల్లా సర్వీసులను కూడా పెంచనున్నట్లు ప్రకటన

త్వరలోనే నిజామాబాద్ నగరంలో సిటీ బస్సు సర్వీసులను నడపనున్నట్లు రవాణ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ నగరం విస్తృతంగా విస్తరిస్తున్నందున సిటీ సర్వీసులు నడిపించడానికి కసరత్తు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇవాళ శాసన మండలికి హాజరైన మంత్రి నిజామాబాద్ ఆర్టీసి సర్వీసులపై ఎంఎల్సీ ప్రభాకర రావు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 
నిజామాబాద్ కేంద్రం లోని బస్ స్టాండ్ మరియు బస్ డిపో లను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రతిపాదనేమీ లేదని మంత్రి తెలిపారు. ఇప్పుడున్న బస్ స్టాండ్, డిపోలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, శివారులకు తరలిస్తే ప్రజలు ఇబ్బందిపడే అవకాశం ఉందని అందువల్ల మార్పులు చేపట్టే ప్రసక్తే లేదని అన్నారు. ఈ నిజామాబాద్ బస్టాండ్ నుండి రోజుకు 1,100 సర్వీస్ లతో 65 వేల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్నట్లు తెలపడం గర్వంగా ఉందరి అన్నారు. ఈ సంఖ్యను పెంచడానికి మరింత మంచి పేవలు అందించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 
అయితే నగరంలో సిటీ సర్వీసులను నూతన కలెక్టర్ కార్యాలయ నిర్మాణం పూర్తయ్యాక ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి తెలిపారు. నిజామాబాద్ లో సిటీ బస్సులు నడపటం తో పాటు ఇతర ప్రాంతాలకు కొత్త సర్వీస్ లు నడిపే అంశం పరిశీలిస్తున్నామని మంత్రి మహేందర్ రెడ్డి మండలి సభ్యులకు వివరించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred