కేటీఆర్ పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్
- కేటీఆర్ పై కోమటిరెడ్డి ఫైర్
- కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని విమర్శించడం మానుకోవాలని సూచన
- లేకుంటే ఊరుకునేది లేదని హెచ్చరిక
తెలంగాణ ఐటీ మంత్రి,ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఈ మద్య అధికార మదంతో మాట్లాడున్నాడని అన్నారు నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కేటీఆర్ మాటలు ఆయనలోని మూర్కత్వాన్ని బయటపెడుతున్నాయని అన్నారు. తాను మంత్రిగా ఉండటం, తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండటంతో ఆయనలో అధికార గర్వం తలకెక్కిందని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ లోఫర్ అంటూ నిన్న కేటీఆర్ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు కోమటిరెడ్డి.
కుటుంబం మొత్తం కలిసికట్టుగా వెళ్లి అప్పటి కాంగ్రెస్ అద్యక్షురాలు సోనియా గాంధీ కాళ్ళు మొక్కినప్పుడు కాంగ్రెస్ పార్టీ లోఫర్ పార్టీ అని ఆయనకు తెలియలేదా అని ప్రశ్నించారు. కేటీఆర్ అని గూగుల్ లో టైప్ చేస్తే దోపిడీ దొంగ అని చూపిస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు రాహుల్ పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీ ప్యామిలీ మీలా దోపిడీ దారులు కాదని అన్నారు. మిషన్ భగీరథ పథకం పేరు చెప్పి సగం కాంట్రాక్టులు కేటీఆర్ దక్కించుకున్నారని, ఈ దోపిడీ డబ్బును దాచుకునేందుకే కేటీఆర్ విదేశీ టూర్ లు చేస్తున్నారని కోమటిరెడ్డి తెలిపారు.
ఇక కేటీఆర్ తనను టీఆర్ఎస్ లో చేరమని ఒత్తిడి తెచ్చారని తెలిపారు కోమటిరెడ్డి.ఇందుకోసం కేటీఆర్ తన ఆఫీస్ కు వచ్చాడని,మంత్రి పదవీ ఇస్తానని టీఆర్ఎస్ పార్టీలో చేరాలని మభ్యపెట్టే ప్రయత్నం చేశారని అన్నారు. అయితే తాను టీఆర్ఎస్ పార్టీలోకి రానని కరాకండిగా చెప్పానని అన్నారు. కావాలంటే కేటీఆర్ నా ఆఫీస్ కు వచ్చిన సీసీ ఫుటేజ్ బయట పెడతానని అన్నారు. పనికిమాలిన మాటలు కేటీఆర్ మానుకోవాలని సూచించారు. ఆయన మానకుంటే సీఎం కేసీఆర్ అయినా అయనకు చెప్పి మాన్పించాలని సూచించారు.
కాంగ్రెస్ అధికారం లోకి రాకపోతే అద్యక్షులు ఉత్తమే కాదు నేను కూడా రాజకీయాల నుండి తప్పుకుంటానని, వస్తే మీరు రాజకీయ సన్యాసం తీసుకోడానికి సిద్దమా అంటూ కేటీఆర్ ను కోమటిరెడ్డి ప్రశ్నించారు.