జగన్ ఇకపై డాక్టర్ అట
వైసిపి అధినేత జగన్ డాక్టర్ అవతారమెత్తుతారట. సిఎం అయిన తర్వాత డాక్టర్ చేసే పనే ఆయన కూడా చేస్తారట. అమరావతి ప్లీనరీ వేదికగా ఆయన స్వయంగా ఈ విషయం వెల్లడించారు. ఇంతకూ జగన్ డాక్టర్ కావడమేంటని మీరంతా ఆశ్చర్యపోతున్నారా? ఆయన తండ్రిలా మెడిసిన్ కూడా చదవకుండా డాక్టర్ ఎలా అనుకుంటున్నరా ఈ స్టోరీ చదవండి మరి.
జగన్మోహన్ రెడ్డి 9 పథకాల్లో భాగంగా చివరి కార్యక్రమం మద్యం గురించి ప్రకటించారు. మద్యం ధరలు షాక్ కొట్టేలా పెంచుతామన్నారు. 100 నుంచి 200 శాతం మద్యం ధరలు పెంచబోతున్నట్లు చెప్పారు. కోటీశ్వరులు మాత్రమే మద్యం తాగాలి తప్ప సామాన్యులు మద్యం అందకుండా దశలవారీగా నిషేధం అమలు చేస్తామన్నారు. తాగుబోతులకు వైసిపి వ్యతిరేకం కాదంటూనే తాగుబోతుల ఇళ్లలో గౌరవాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు.
మద్యం విషయంలో ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంటే మద్యం తాగేవారు ఓట్లు వేస్తారా లేదా అన్న భయం తమకు అవసరం లేదన్నారు జగన్. ఎందుకంటే మద్యం వల్ల కుటుంబాలు నాశనమైపోతున్నాయి మద్యం తాగిన వారిని ఒక డాక్టర్ సూది మందు ఇచ్చి ఎలా వైద్యం చేస్తాడో అలా డాక్టర్ చేసే పనే తాను చేస్తానని చెప్పుకొచ్చారు జగన్. కానీ మద్యం తాగే వారిని మభ్యపెట్టి వారి ఓట్ల కోసం చంద్రబాబు లాగా తియ్యటి మాటలు చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు. బాధ కలిగించేదైనా సూది మందు వేస్తే ఎలా ఉపయోగం ఉంటుందో కఠినమైన పని అయినప్పటికీ... తాను కూడా అలాంటి డాక్టర్ చేసే పనే చేస్తానని చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి.
మొత్తానికి జగన్ మెడిసిన్ చదవలేదు. కానీ డాక్టర్ కాబోతున్నాడు. అయితే ఆయన తండ్రి మాత్రం మెడిసిన్ చదివి డాక్టర్ అయ్యారు. రాజకీయాల్లోకి వచ్చి సిఎం అయ్యారు. మరి జగన్ మాత్రం వైఎస్ లా కాకుండా డాక్టర్ లాంటి డాక్టర్ అవుతారన్నమాట.