హాల్ టికెట్ ఇవ్వలేదని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
- వనపర్తి జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య
- ఫీజు కట్టలేదని హాల్ టికెట్ ఇవ్వని యాజమాన్యం
మరికొన్నిగంటల్లో పరీక్ష. కానీ ఫీజు కట్టలేదని ఆ విద్యార్థికి హాల్ టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది కాలేజీ యాజమాన్యం. సంవత్సరం పాటు కష్టపడి చదివితే చివరకు పరీక్షలకు హాజరుకాక పోవడంతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఇలా ప్రైవేట్ కాలేజీల ఫీజుల దాహానికి తెలంగాణలో మరో విద్యార్థి బలయ్యాడు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వనపర్తి జిల్లా నర్వ మండలం రాయికోడ్ గ్రామానికి చెందిన యువకుడు నవీన్ రావుస్ జూనియర్ కళాశాల లో చదువుతున్నాడు. ఇతడు కాలేజీ హాస్టల్లోనే ఉంటూ ఎంపిసి మొదటి సంవతకసరం చదువుతున్నాడు. అయితే ఇతడు కళాశాలలో ఫీజు కట్టలేదని చెప్పి యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది. అయితే చివరి క్షణంలో ఇస్తారని ఆశించినప్పటికి ఇవ్వకపోవడంతో ఇవాళ జరిగిన పరీక్షకు హాజరుకాలేక పోయాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన విద్యార్థి ఆత్మహత్య కు పాల్పడ్డాడు.
విద్యార్థి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.