శ్రీదేవి మృతిపై కాన్సులేట్ అధికారులు ఏమంటున్నారంటే
- శ్రీదేవి మరణంపై స్పందించిన కాన్సులేట్ అధికారులు
- మృతదేహాన్ని ఇండియాకు తరలించే ఏర్పాట్లు
దేశ ప్రజలను తన అందంతో, అభినయంతో కట్టిపడేసిన శ్రీదేవి ఇవాళ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆమె మరణంపై దుబాయ్ లోని భారత కాన్సులేట్ అధికారులు అందించిన సమాచారం ప్రకారం రాత్రి 11 గంటలకు శ్రీదేవి తుది శ్వాస విడిచారు. దుబాయ్ లోరి ఎమిరేట్స్ టవర్ హోటల్ లోని బస చేసిన శ్రీదేవి బాత్రూంలో ఉన్నపుడు గుండెపోటు వచ్చినట్లు సమాచారం. అక్కడే ఆమె కుప్పకూలడంతో గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన రషీద్ హాస్పిటల్ కి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో ఆమె పార్థీవ దేహాన్ని పరీక్షల కోసం ఫోరెన్సిక్ విభాగానికి అప్పగించారు.
శ్రీదేవి మృతదేహం ప్రస్తుతం అల్ క్వాసిస్లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఉంచారు. కాన్సులేట్ అధికారులు ఆమె భౌతిక కాయాన్ని భారత్ తరలించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ ప్రైవేట్ జెట్లో ఆమె మృతదేహాన్ని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వారు అందించిన సమాచారం ప్రకారం రాత్రి 8 గంటల సమయంలో పార్థీవ దేహాం ముంబై చేరే అవకాశం ఉంది.