కింగ్ కోబ్రా గుడ్లు కనిపించాయి గతంలో పాము గుడ్లను గ్రామస్థులు తగలపెట్టారు.
అల్లంత దూరంలో ఓ చిన్న పాము కనిపిస్తేనే.. గజగజ వణికిపోతాం. అలాంటిది పెద్ద పాము.. అందులోనూ కింగ్ కోబ్రా కనిపిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి. మామూలు వాళ్లు అయితే..కనీసం ఒక్క నిమిషం కూడా అక్కడ నిలబడరు. వెంటనే పరుగులు తీస్తారు. కానీ.. ఓ ముగ్గురు వ్యక్తులు మాత్రం అలా చెయ్యలేదు..సరికదా.. ఆ పాము పెట్టిన గుడ్లకు కాపలా కాసారు. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
కొట్టియూర్ ప్రాంతంలో చంద్రన్ అనే వ్యక్తి అటవీశాఖ అధికారిగా పనిచేస్తున్నాడు. అతనికి గత ఏప్రిల్ 22న ఓ వ్యక్తి కింగ్ కోబ్రాను చూశానంటూ ఫోన్ చేశారు.దీంతో ఆ అధికారి.. వన్యప్రాణి ఫొటోగ్రాఫర్, అటవీగార్డ్తో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అయితే వారికి కింగ్కోబ్రా కనిపించలేదు కానీ.. అది పెట్టిన గుడ్లు పెద్దసంఖ్యలో కనిపించాయి.
భయంతో ఆ విషసర్పం గుడ్లను వదిలేసి వెళ్లినట్లు గుర్తించారు. గతంలోనూ ఒకసారి పాము ఇలాగే గుడ్లు పెడితే వాటిని గ్రామస్తులు తగలపెట్టారు. దీంతో ఈసారి ఆ గుడ్లను రక్షించాలని ఆ ముగ్గురు నిర్ణయానికి వచ్చారు. వాటిని పొదిగే వరకూ కాపాడలనుకున్నారు. అప్పటి నుంచి ఆ ముగ్గురు వంతులవారీగా వాటికి రక్షణగా ఉంటున్నారు. ఈ విషయం గురించి గ్రామస్థులకు చెప్పి వారిని ఒప్పించారు. పాము పిల్లలు బయటకి రాగానే వాటిని అటవీప్రాంతంలో దూరంగా వదిలిపెడతామని వారికి చెప్పారు.
ఈ ప్రాంతం 90 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ రోజుకొకసారి వచ్చి గుడ్లను కాపాడుతూ వచ్చారు. 72 రోజుల అనంతరం గుడ్ల నుంచి పాము పిల్లలు రావడం గమనించారు. అనంతరం వాటిని సమీప అటవీప్రాంతంలోకి వదిలేశారు.
