సింగరేణి కష్టాలను తీర్చిన మహనీయుడు కాకా
- వెంకట స్వామి వర్ధంతి సభలో పాల్గొన్న మంత్రి హరిష్ రావు
- తెలంగాణ ఉద్యమంలో కాకాతో తన అనుభందాన్ని గుర్తుచేసుకున్న హరిష్
బాగ్ లింగంపల్లిలోని అంబేద్కర్ లా కళాశాలలో దివంగత కాంగ్రెస్ నాయకుడు వెంకటస్వామి వర్థంతి వేడుకులు ఘనంగా జరిగాయి. ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొని కాకా విగ్రహానికి పూలమల వేసి నివాళులర్పించారు. అనంతరం అదే కళాశాల ప్రాంగణంలో జరిగిన వర్థంతి సభలో ప్రసంగించిన హరీష్ తెలంగాణ ఉద్యమంలో కాకా పోషించిన పాత్రను గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమానికి కాకా వెన్నుదన్నుగా నిలిచాడని అతడి సేవలను తెలంగాణ సమాజం మరువదని మంత్రి ప్రశంసలు కురిపించారు.
వెంకటస్వామి మంత్రిగా ఉన్నపుడే కార్మికులకు కూడా పెన్షన్ సౌకర్యాన్ని కల్పించారని హరిష్ తెలిపారు. ఈ ఒక్క నిర్ణయంతోనే అతడు కార్మికుల హృదయాలను గెలిచుకున్నాడని తెలిపారు. అలాగే సింగరేణిని కాపాడేందుకు రూ. 1400 కోట్ల రుణం ఇప్పించిన ఘనత కాకా కే దక్కుతుందని తెలిపారు. ఆ సమయంలో ఈ రుణం సింగరేణి సంస్థకు పునరుత్తేజం తీసుకువచ్చి ఇప్పటి లాభాల సింగరేణిగా మార్చిందని హరిష్ స్పష్టం చేశారు
ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో కాకాతో తన అనుభందం మరువలేనిదని, తమది తెలంగాణ సాధన ఉద్యమమే కలిపిందన్నారు హరిష్. విద్యార్థులందరు ఇలాంటి నాయకులను ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తన కళ్ల ముందే తెలంగాణ వచ్చినందుకు కాకా ఎంతో ఆనందపడ్డాడని తెలిపిన మంత్రి, ఈ తెలంగాణ చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచే విధంగా చూస్తామని మంత్రి హరీష్రావు తేల్చిచెప్పారు.