డైరెక్టర్ గౌతమ్ మీనన్ కు యాక్సిడెంట్
- రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ గౌతమ్ మీనన్
- చెన్నై సమీపంలో దుర్ఘటన
- టిప్పర్ లారీని ఢీకొట్టిన గౌతమ్ కారు
ఇవాళ తెల్లవారుజామున సంచలన డైరెక్టర్ గౌతమ్ మీనన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారు టిప్పర్ లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మహాబలిపురం నుంచి చెన్నైకి కారులో ప్రయాణిస్తుండగా శోలింగనల్లూరు సిగ్నల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు లో ఎయిర్ బ్యాగ్స్ ఉండటంతో గౌతమ్ మీనన్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
అయితే ఆయన ప్రయాణిస్తున్న లగ్జరీ కారు మాత్రం తుక్కు తుక్కయింది. ఈ కారు లగ్జరీ కారు కావడం, అడ్వాన్సెడ్ ఎయిర్ బ్యాగ్స్ సిస్టమ్ ఉండటంతోనే గౌతమ్ మీనన్ స్వల్ప గాయాలతో బయటపడ్డారని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాద సమయంలో గౌతమ్ కారు ఇంచుమించు 80 కిలోమీటర్ల స్పీడులో ప్రయాణించినట్లు, ఇదే వేగంతో ఎదురుగా వచ్చిన లారిని ఢీ కొట్టినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. గాయాలపాలైన గౌతమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
గౌతమ్ మీనన్ ప్రస్తుతం విక్రమ్ హీరోగా థృవనచ్చిత్రం అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తమిళంతో పాటు తెలుగులోను పలు సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. ఈ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు గౌతమ్. అలాంటి తమ అభిమాన డైరెక్టర్ రోడ్డు ప్రమాదానికి గురవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.