తెలంగాణ బిజెపికి షాక్  పార్టీని వీడనున్నట్లు ప్రకటించిన  మహిళా నాయకురాలు రవళి పార్టీ అధ్యక్షుడికి రాజీనామ లేఖ పంపిన రవళి

తెలంగాణ బీజేపిలో పెద్ద ఝలక్ తగిలింది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ప్రత్నిస్తున్నామంటూ ఈ పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్న వేళ ఓ కీలక మహిళా నేత పార్టీని వీడటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా వున్న రవళి బిజెపి పార్టీకి రాజీనామా చేసింది. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ కు రాసిన రాజీనామా లేఖలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవికి రాజీనామా చేసినట్లు పేర్కొంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇంకా తన రాజీనామా లేఖలో రవళి అనేక విషయాలను ప్రస్తావించింది. బిజెపి ఆశయాలకు ఆకర్షితురాలై రాష్ట్ర, దేశ భవిష్యత్తుకు ఈ పార్టీ అవసరమని 4 సంవత్సరాల క్రితం ఈ పార్టీలో చేరినట్లు రవళి వెల్లడించారు. తెలంగాణ ఉద్యమం తారాస్థాయిలో ఉన్న 2013 సంవత్సరంలో బిజెపి తరపున ఉద్యమంలో కీలకపాత్ర పోషించానని తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ఎదగడంలో బిజెపి విఫలమైందని రవళి ఆరోపించారు. తమలాంటి వారు అందుకు ప్రయత్నిస్తున్నా పార్టీలో అంతర్గత, బహిర్గత సమస్యలతో ముందుకు వెళ్లలేక పోతున్నామని తెలిపారు. ఇలాంటి స్వేచ్చ లేని పరిస్థితుల్లో పార్టీలో ఉండటం కంటే వీడటమే మంచిదని బావించి తానీ నిర్ణయం తీసుకున్నట్లు రవళి పేర్కొన్నారు. సహృదయంతో తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ ని కోరారు. ఈ లేఖను అధ్యక్షుడితో పాటు బిజెపి శాసనసభాపక్ష నాయకులు కిషన్ రెడ్డి, పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మంత్రి శ్రీనివాస్, మహిళా మోర్చ అధ్యక్షురాలు ఆకుల విజయకు కూడా పంపిస్తున్నట్లు రవళి పేర్కొన్నారు.