కేసీఆర్ సర్కార్ కు బిజెపి లక్ష్మణ్ వార్నింగ్ (వీడియో)
- మంద కృష్ణ మాదిగను పరామర్శించిన బిజేపి లక్ష్మణ్
- ఎస్సీ వర్గీకణపై సీఎం మాటతప్పారన్న లక్ష్మణ్
తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని, ప్రభుత్వ తీరును ప్రశ్నించిన వారిని జైళ్లలో పెట్టి పాలన కొనసాగిస్తున్నారని బిజేపి రాష్ట్ర అద్యక్షుడు లక్ష్మణ్ తెలంగాణ సర్కార్ పై విరుచుకుపడ్డారు. ప్రజలు నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారని, అందుకు నిదర్శనం మంద కృష్ణ మాదిగ అరెస్టేనని లక్ష్మణ్ అన్నారు. ఇవాళ ఆయన చంచల్ గూడ జైలుకు వెళ్లి మాదిగ రిజర్వేషన్ల కోసం పోరాడుతూ జైలుశిక్ష అనుభవిస్తున్న మంద కృష్ణ మాదిగ ను పరామర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజలు తమ బాధలను, సమస్యలను తెలిపే హక్కు కూడా లేకుండా సర్కార్ వ్యవహరిస్తోందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రం లో పోలీస్ రాజ్యం నడుస్తోందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 16 శాతమున్న ఎస్సి ప్రజలు తమకు వర్గీకరణ కావాలంటూ న్యాయ పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం బాధాకరమన్నాడు లక్ష్మణ్. గతంలో ఎస్సి వర్గీకరణ కోసం అన్ని పార్టీలను ఢిల్లీ కి తీసుకెలతానని చెప్పిన కేసీఆర్ మాట తప్పాడన్నారు. రాష్ట్రంలో దళిత, రైతు నాయకుల పై అక్రమ కేసులు నమోదు చేసి జైల్ లో పెట్టడం జరుగుతోందన్నారు. తెలంగాణ ఉద్యమం లో ఇంతకంటే హింసలు జరిగాయని, కానీ అప్పుడు ఎవరిని జైల్లో పెట్టిన దాఖలాలు లేవన్నారు. స్వరాష్ట్రంలో మాత్రం పోలీసుల పహారాలో పాలనసాగిస్తూ, నిరసనలు తెలిపిన వారిని జైళ్ల పాలు చేస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు.
లక్ష్మణ్ తో పాటు ఎం ఎల్ సి రాంచందర్ రావు, పలువురు బిజెపి కార్యకర్తలు కూడా మంద కృష్ణ మాదిగను పరామర్శించారు.