ట్రాఫిక్ లో జరిగిన గొడవ కత్తుల దాడికి దారితీసింది
- సికింద్రాబాద్ లో ఇద్దరు యువకులపై కత్తులతో దాడి
- ట్రాఫిక్ లో ఏర్పడ్డ చిన్న వివాదమే కారణం
మితిమీరిన వేగంతో బైక్ పై వెళుతున్న ఓ యువకుడికి చూసుకుని వెళ్లమని సలహా ఇచ్చినందుకు కత్తులతో దాడిచేసి గాయపర్చిన సంఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది. ఈ దాడిలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పట్టపగలే నడి రోడ్డుపై ఎప్పుడూ రద్దీగా ఉండే రెజిమెంటల్ బజార్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. దీనికి సంబంధిచిన వివరాలిలా ఉన్నాయి.
మారేడుపల్లికి చెందిన యువకులు శంకర్(21), శ్రీనాథ్(20)లు పుస్తకాలు కొనడానికి బైక్ పై సికింద్రాబాద్ బయలుదేరారు. అయితే వీరు సంగీత్ చౌరస్తా వద్దకు రాగానే ఓ యవకుడు మితిమీరిన వేగంతో బైక్ పై వెళుతూ ప్రమాదకర రీతిలో వీరిని ఓవర్ టేక్ చేశాడు. దీంతో వీరు ఆ యువకుడిని మందలించే ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆ యువకుడు అతడి వద్దగల కత్తితో ఇద్దరిపై దాడి చేశాడు. శ్రీనాథ్ ను కడుపులో, శంకర్ ను మెడపై కత్తితో పొడిచి అక్కడినుండి పరారయ్యాడు.
ఈ దాడి విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు గాయపడిన విద్యార్థులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని గుర్తించి పట్టుకునేందుకు ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో ఉన్న రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.