ఎక్స్ ప్రెస్ న్యూస్ : "ఆ విషయంలో కేసీఆర్ ను మించిన సీఎం దేశంలోనే లేడు"
విశేష వార్తలు
- కేసీఆర్ ను హిందూ దర్మ పరిరక్షకుడిగా పేర్కొన్న విశాఖ పీఠాధిపతి
- కేంద్ర ప్రభుత్వం పై సుప్రీం కోర్టు ఆగ్రహం
- రోడ్డు ప్రమాద భాధితుడిని కాపాడిన ఎపి మంత్రి చినరాజప్ప
- ఉప్పల్ రోడ్డు ప్రమాదంలో ఓ ఎస్సై మృతి
- హెచ్సియూ లో మిజోరాంకు చెందిన విద్యార్థి ఆత్యహత్యాయత్నం
- రాజస్థాన్ ఎసిబి వలలో ఎపి పోలీసులు
"ఆ విషయంలో కేసీఆర్ ను మించిన సీఎం దేశంలోనే లేడు"
హిందూ ధర్మ పరిరక్షణ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను మించిన సీఎం దేశంలో ఎవరూ లేరని విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ప్రశంసించారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేసీఆర్ రాష్ట్ర ప్రజల కోసం ఆయత చండీయాగం చేసి అటు ప్రజలను, ఇటు హిందూ ధర్మాన్ని కాపాడాడంటూ ప్రశంసించారు. కార్తీక మాసం సంధర్భంగా హన్మకొండలో నిర్వహించిన మహారుద్రేశ్వరుడి లక్ష్ బిల్వార్చన పూజా కార్యక్రమంలో పాల్గొన్న స్వామి సీఎం పై ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బిజెపి ''చలో అసెంబ్లీ" టెన్షన్ టెన్షన్ (వీడియో)
బిజెపి యువ మోర్చా ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అసెంబ్లీ వద్దకు చేరుకున్న యువ మోర్చ నాయకులు అసెంబ్లీ లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ కాస్త గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు బలవంతంగా వారిని అరెస్ట్ చేసి సమీప పోలీస్ స్టేషన్ కు తరలించారు.
చిరంజీవి ఇంట్లో దొంగిలించింది రెండు కాదు రూ.16 లక్షలు
మెగాస్టార్ చిరంజీవి నివాసంలో దొంగతనం జరిగిన విశయం తెలిసిందే. రూ. 2 లక్షల నగదు చోరీ అయినట్లు చిరు మేనేజర్ గంగాధర్ నిన్న పోలీసులకి ఫిర్యాదు చేశాడు. ఈ చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా చిరంజీవి ఇంటి పనిమనిషి చెన్నయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా మరిన్ని నిజాలు బైటపడ్డాయి.
చిరంజీవి గత పదేండ్లుగా చిన్నయ్య పనిచేస్తున్న చెన్నయ్య ఇప్పటి వరకు పలు విడతలుగా రూ.16లక్షలు దొంగిలించినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ డబ్బులతో అతను రెండు చోట్ల ఫ్లాట్స్ కూడా కొనుగొలు చేసినట్టు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.. ఫ్లాట్స్ పత్రాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితుడి నుండి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై దాఖలైన పిటిషన్ పై కౌంటర్ దాఖలుచేయకపోవడంపై సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వం పై మండిపడింది. పోలవరం ప్రాజెక్టుపై నిర్మాణంపై అభ్యంతరాలు తెలుపుతు ఒడాషా ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తమకు కూడా అవకాశం కల్పించాలంటే తెలంగాణ, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలు కూడా సుప్రీంను ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ఇదివరకే కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, రూ.25 వేల జరిమానాను విధించింది.
భారీ బందోబస్తు మద్య ప్రారంభమైన భారతి శవయాత్ర
సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా గాయపడి, ఉస్మానియా లో చికిత్స పొందుతూ చనిపోయిన ఎమ్మార్పిఎఫ్ మహిళా కార్యకర్త భారతి శవయాత్ర ఉస్మానియా ఆస్పత్రి నుండి ప్రారంభమైంది.ఇందుకోసం ఎమ్మార్ఫిఎఫ్ కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ యాత్ర అప్జల్ గంజ్ ,కాచిగూడ మీదుగా పార్శి గుట్ట లోని ఎమ్మార్పిఎఫ్ కార్యాలయానికి చేరుకోనుంది. అక్కడ కొద్దిసేపు మృతదేహాన్ని వుంచి అక్కడి నుంచి స్మశానానికి తరలించనున్నారు.
మానవత్వాన్ని చాటుకున్న ఎపి మంత్రి
ప్రమాదంలో గాయపడిన యువకుడిని స్వయంగా తన కాన్వాయ్ వాహనంలో ఆస్పత్రికి తరలించి ఎపి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మానవత్వాన్ని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా అమలాపురం లోని కెనాల్ రోడ్డులో సుధీర్ వర్మ అనే యువకుడు బైక్ ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలతో రోడ్డు ప్రక్కన పడివున్న యువకుడిని అటువైపునుంచే వెళుతున్న హోంమంత్రి చినరాజప్ప గమనించాడు. తీవ్ర గాయాలపాలైన ఆ యువకుడిని స్వయంగా తన కాన్వాయ్ పోలీసు వాహనంలో కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. భాధితుడి బంధువులకు సమాచారం అందించమని, కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించాలని అమలాపురం డిఎస్పీ ప్రసన్నకుమార్ ను హోంమంత్రి చినరాజప్ప ఆదేశించారు.
ఉప్పల్ లో రోడ్డు ప్రమాదం,ఓ ఎస్సై మృతి
హైదరాబాద్ : ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ సిగ్నల్ వద్ద ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ఎస్సై మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే టీ ఎస్ ఎస్ పీ లో ఎస్సైగా పని చేస్తున్న సురేష్ బాబు ద్విచక్రవాహనం పై యూసుప్ గూడ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళుతున్నాడు. ఈ క్రమంలో ఉప్పల్ లిటిల్ ప్లవర్ సిగ్నల్ వద్ద ఎదురుగా వేగంగా వచ్చిన లారీ డీ కొట్టడంతో సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
హెచ్సియూ విద్యార్థి ఆత్యహత్యాయత్నం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చదువుతున్న మిజోరాం రాష్ట్రానికి చెందిన విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. యూనివర్సిటీ హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి బీర్బల్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తోటి విద్యార్థులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
ఈ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
రాజస్థాన్ ఎసిబికి చిక్కిన విశాఖ పోలీసులు
దొంగల నుంచి లంచం తీసుకుంటూ విశాఖ పోలీసులు రాజస్థాన్ ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబబడ్డారు. విపీఎం పాలెం పీఎస్ క్రైం సిఐ చౌదరి, పరవాడ ఎస్ఐ,మహారాణి పేట ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ లు ఓ దొంగల ముఠాను పట్టుకోడానికి రాజస్థాన్ కు వెళ్లారు. అయితే అక్కడ దొంగల నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
అయితే రికవరి సొత్తునే లంచంగా ఇచ్చినట్టు ఎసిబి అధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారంటున్న ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు ఆరోపిస్తున్నారు.
విహారంలో విషాదం, ఐదుగురు హైదరబాదీల మృతి (వీడియో)
సరదాగా కర్ణాటక రాష్ట్రంలోని బంధువుల ఇంటికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి చెందారు. మృతుల్లో నలుగురు యువతులు, ఓ యవకుడు ఉన్నాడు. కర్ణాటక లోని కొప్పళ జిల్లా గంగావతి తాలూకా హేమగుడ్డ శ్రీ దుర్గా పరమేశ్వర దేవాలయం వద్దనున్న చెరువులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులను ప్రవల్లిక (16), పవిత్ర (15), పావని (14), రాఘవేంద్ర (32), ఆశిష్ (15)లుగా గుర్తించారు.