నేటి విశేషాలు అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిన జీ ఎస్సెల్ సంస్థ లారీ ఢీకొన్న ఆంధ్రా డిజిపి కారు, డిజిపి సురక్షితం యూనిఫాం వేసుకురానందున దారుణ శిక్ష విధించిన స్కూల్ మీద కెటిఆర్ ఆగ్రహం శాస్త్రిపురం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఒమర్ బిన్ ఒమద్ పై దాడిచేసిన దుండగులు ఇంకా ఎన్నో తాజా వార్తలు...
అగ్రిగోల్డ్ ను చేజిక్కించుకునేందుకు ఎస్సెల్ సంస్థ ప్రయత్నాలు
అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు జీ ఎస్సెల్ అనే సంస్థ ముందుకు వచ్చింది. ఇవాళ ఈ కేసుపై విచారించిన హై కోర్టు అగ్రిగోల్డ్ ఆస్తులను చేజిక్కించుకోడానికి ఎంత మొత్తాన్ని డిపాజిట్ చేస్తారని ఎస్సెల్ సంస్థను ప్రశ్నించింది. అయితే ఆస్తుల వివరాలు తెలియకుండా ఎంత డిపాజిట్ చేయాలో ఎలా తెలుస్తుందని సంస్థ సభ్యులు తెలిపారు.అగ్రిగోల్డ్ సంస్థ పూర్వాపరాలను తెలియజేస్తే ఎంత డిపాజిట్ చెయ్యగలయో చెప్తామని ఎస్సెల్ సంస్థ ప్రతినిధులు కోర్టుకు విన్నవించారు. దీనిపై తదుపరి విచారణలో తమ అభిప్రాయాన్ని చెబుతామన్న న్యాయస్థానం విచారణను గురువారానికి వాయిదా వేసింది.
లారీని ఢీకొన్న ఆంధ్రా డిజిపి కారు, డిజిపి సురక్షితం

పశ్చిమగోదావరి జిల్లాలో ఆంధ్ర ప్రదేశ్ డిజిపి సాంబశివరావుకు ప్రమాదంతప్పింది. తణుకు వద్ద ఎన్ హెచ్ పై ఆయన ప్రయాణిస్తున్న కారు ఒక లారీని ఢీ కొంది. సాంబశివరావు సురక్షితం. గాయాలు కూడా తగల్లేదు. కాకపోతే, కారు స్వల్పంగా ధ్వంసమయింది. రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే వేరే కారులో డిజిపిని విజయవాడకు పంపించారు.
తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఏలూరు సమీపంలోని ఇరగవరం గ్రామంలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ కామాందుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక కు మాయమాటలు చెప్పి బైక్ పై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లిన యువకుడు పాపపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న చిన్నరి తల్లిదండ్రులు తణుకు ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
శేషాచలం అడవుల్లో చిక్కుకున్న ముగ్గురు విద్యార్థులు
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం కాలిబాట మార్గంలో కొండను ఎక్కుతున్న ముగ్గురు పాలిటెక్నిక్ విద్యార్థులు శేషాచలం అడవుల్లో చిక్కుకున్నారు. కపిల తీర్థం ప్రాంతంలో వీరు అడవిలోకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వారి ఆచూకీ కోసం శేషాచలం. కపిలతీర్థం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.
దుర్గ గుడి ప్లైఓవర్ పై ట్రాఫిక్ ఆంక్షలు
విజయవాడ లోని ఇంద్రకీలాద్రి ఆలయం వద్ద గల ప్లైఓవర్ పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఈ మార్గంలో నడిచే వాహనాలను నెల రోజుల పాటు దారి మళ్లించనున్నారు. పెద్ద వాహనాలనే కాదు ద్విచక్ర వాహనాలను కూడా అనుమతించకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో నడిచే వాహనాలన్ని పాతబస్తీ ప్రాంతంనుంచి వెలుతుండటంతో అక్కడ ట్రాఫిక్ కష్టాలు ఎక్కువయ్యాయి.
కెటిఆర్ ఆగ్రహం
బి హెచ్ ఇ ఎల్ రావూస్ హైస్కూల్ లో యూనిఫాం వేసుక రాలేదని అమ్మాయి ని అబ్బాయి ల మూత్రశాలలో నిలబెట్టడంపై రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటి రామారావు ఆగ్రహం వక్తం చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విాట్ ద్వారా పోలీసుల దృష్టి కి తీసుకువచ్చారు.

ఒక బాలికకు జరిగిన ఈ అవమానాన్ని బాలల హక్కుల కమిషన్ గౌరవ అధ్యక్షుడు అచ్చుత రావు వెలుగులోకి తీసుకువచ్చారు.మొదట అమ్మాయి తండ్రి అమిరి శెట్టి రామకృష్ణ బాలల హక్కుల సంఘానికి తన కూతరుకు పాఠ శాల విధించిన శిక్ష మీద ఫిర్యాదు చేశారు. తన కూతురు బి హెచ్ ఇ ఎల్ రావూస్ హైస్కూల్ లో చదువుతున్నదని,యునిఫాం వేసుక రాలేదన్నకారణంతో అబ్బాయిల మూత్ర శాలలో చాలా పు నిలబెట్టారని చెప్పారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ నవ్య దృష్టికి తీసుక వెళ్లినా స్పందించక పోగా సిబ్బంది నే సమర్దించారని ఆయన చెప్పారు.
ఈ ఘటన తో మానసికంగా ఆవేదన చెందుతున్న చిన్నారి తాను జన్మ లో స్కూల్ కి వెళ్ళనని చెబుతున్నదని తండ్రి ఆరోపించారు.
రావూస్ హైస్కూల్ వారు చేసిన ఈ నిర్వాకం పోక్సో చట్టం ప్రకారం నేరంగా పరిగణించ వచ్చునని అచ్యుత రావు తెలిపారు. ఆ మేరకు బాలల హక్కుల సంఘం రావూస్ హైస్కూల్ యాజమాన్యం పై క్రిమినల్ కేసు నమోదు చేయనున్నదని ఆయన తెలిపారు. నిన్న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జరిగిన ఈ ఘటన పై విద్యా శాఖ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల పంఘం కమిషన్ గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు కోరారు.
స్కూల్ బస్సుల మధ్య పోటీ, తృటిలో తప్పిన ప్రమాదం
కంకిపాడు మండలం మంతెన వద్ద తృటి ఒక స్కూల్ బస్సుకు ప్రమాదం తప్పంది. చైతన్య స్కూల్ బస్ ను ఓవర్ టేక్ చేసే ప్రయత్నం లో విజయవాడ కు చెందిన రవీంద్ర భారతి స్కూల్ బస్ అదుపు తప్పింది. రోడ్ పక్కనే ఉన్న దిమ్మలను గుద్దుకొనింది. అయితే బస్సు బోల్తాపడ లేదు. ఒక పక్కపోయి ఒరిగి ఆగిపోయింది. ప్రమాదo జరిగిన సమయం లో బస్ లో 55 మంది విద్యార్దులున్నారు. స్థాననికుల సాయం తో విద్యార్దులను కిందకు దించారు. ప్రమాదం జరిగిన తీరు పై విద్యార్దుల తల్లి దండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
5 కోట్ల విలువయిన డ్రగ్ స్మగ్లింగ్ చేస్తున్న జవాన్ల అరెస్ట్

సుమారు 5 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ను తరలిస్తున్న రాజు షేక్, ఫూల్ సింగ్ అనే ఇద్దరు జవాన్లను హిమాచల్ ప్రదేశ్ పోలీసులు డెహ్రడూన్లో సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి కారులో తరలిస్తున్నారు. సోదా చేస్తున్నపుడు మేం జవాన్లం అంటూ వారు వాగ్వాదానికి దిగారు. హెరాయిన్తో పట్టుపడిన జవాన్లను, మూడో వ్యక్తిని డెహ్రాడూన్ తరలించారు. వీరి మీద మాదక ద్రవ్యాల అక్రమ రవాణ 8/21 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు డెహ్రాడూన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నివేదిత తెలిపారు.
భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. శ్రీనగర్ లోని కుడ్వాయి ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో తనిఖీలు చేపడుతున్న బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగపడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ మొజాహిదీన్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను హతం చేశారు.
టీఆర్ఎస్ కార్యకర్తపై దాడి
రంగారెడ్డి : రాజేంద్రనగర్ సర్కిల్ శాస్త్రిపురం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఒమర్ బిన్ ఒమద్ పై నిన్న అర్థరాత్రి 10 మంది యువకులు దాడి చేశారు. కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలైనా ఒమర్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఎంఐఎం పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరినందుకు ముస్లీం లీగ్ కార్యకర్తలే ఈ దాడికి పాల్సడ్డారని ఒమర్ పేర్కొన్నాడు. ఈ దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్న మైలార్ దేవ్ పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
