మరో తెలంగాణ యువకుడి బలి
- ఉద్యోగాల కోసం మరో యువకుడి ఆత్మహత్య
- వికారాబాద్ జిల్లాలో విషాదం
ఉద్యోగం రావడంలేదనే మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీలో మురళి, నిర్మల్ జిల్లాలో బూమేశ్ ల ఆత్మహత్యల గురించి మరువక ముందే మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలంరేగుతోంది.
వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లాలోని తాండూరు మండలం వీర్సెట్టిపల్లికి చెందిన చంద్రమోహన్ పోటా పరీక్షల కోసం ప్రిపేరవుతున్నాడు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగం వస్తుందని ఎదురుచూసిన అతడు ఉద్యోగ నియామకాలు చేపట్టక పోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో అతడు విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు వస్తాయని ఎప్పుడూ చెప్పేవాడని, అయితే రాష్ట్రం ఏర్పడి 42 నెలలు గడుస్తున్నా ఉద్యోగ నియామకాల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని తమతో ఎప్పుడూ చెబుతుండువాడని కుటుంబసభ్యులు తెలిపారు. చివరికి ఉద్యోగం వస్తుందో రాదోనన్న ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. అయితే మృతదేహం వద్ద తమకు ఎలాంటి సూసైడ్ లెటర్ దొరకలేదని పోలీసులు తెలిపారు.