ఆవు రక్తంలో హెచ్ఐవీ నిరోధకాలు ‘నేచర్‌’ జర్నల్‌  వెల్లడి


హెచ్ఐవీ ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక వ్యాధి. వైద్యానికి తలొగ్గని ఈ మహమ్మారిని తరిమికొట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా పరిశోదనలు జరుగుతున్నాయి. అలా అమెరికాకు చెందిన స్క్రిప్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, టెక్సాస్‌ ఏ అండ్‌ ఎం యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన ఓ పరిశోధనలో ఆసక్తికర అంశాలు బైటపడ్డాయి.
హెచ్‌ఐవీ ని నయం చేసే మార్గాలను అన్వేషించిన పరిశోదకులు, ఆ వివరాలను ‘నేచర్‌’ జర్నల్‌లో ప్రచురించారు. భారతీయులు ఎంతో పవిత్రంగా పూజించే గోవు జన్యువులతో హెచ్‌ఐవీని నయం చేయవచ్చని తమ పరిశోదనల్లో తేలిందన్నారు.


 అవు రక్తంలో హెచ్‌ఐవీ వైరస్‌కు వ్యతిరేకంగా అత్యంత వేగంగా నిరోదకాలు తయారవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ప్రపంచాన్ని వేధిస్తున్న హెచ్‌ఐవీ చికిత్సపై కొత్త ఆశలు మొదలయ్యాయని వారు తెలిపారు.


శాస్త్రవేత్తలు పరిశోధనలో భాగంగా ఆవు దూడలకు హెచ్‌ఐవీ ఇమ్యునోజన్స్‌ ను ఎక్కించారు. అప్పుడు వెంటనే లేగ దూడల రక్తంలో హెచ్‌ఐవీ ని నిరోధించే ప్రతిరక్షకాలు అభివృద్ధి కావడం జరిగింది. ‘ఎన్‌సీ-సీఓడబ్ల్యూ 1’ అనే ప్రతిరక్షకం హెచ్‌ఐవీ ప్రభావాన్ని తగ్గించడంలో సహకరించినట్లు వారు తెలిపారు.
ఈ ప్రతిరక్షకాలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవడం ద్వారా ఎయిడ్స్ కి వైద్యాన్ని కనుగొనడం సాధ్యపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకోసం తమ పరిశోదనల్ని కొనసాగించనున్నట్లు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు.