సాధారణంగా చాలామంది జీర్ణ సమస్యలతో బాధపడుతుంటారు. వాటిని ఎలా తగ్గించుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. అలాంటి వారు ఈ ఒక్క యోగాసనం వేస్తే చాలు.. సమస్యలన్నీ దూరమవుతాయి. మరి ఆ ఆసనమెంటో చూద్దామా…
ఎవరైనా ఈజీగా చేయగలిగే యోగాసనాల్లో వజ్రాసనం ఒకటి. చూడటానికి సింపుల్గా ఉన్నా.. దీని ప్రయోజనాలు మాత్రం చాలా ఉన్నాయి. ప్రతిరోజూ వజ్రాసనం వేస్తే జీర్ణవ్యవస్థ బలపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. భోజనం తర్వాత ఈ ఆసనాన్ని వేస్తే.. ఆహారం ఈజీగా జీర్ణమవుతుంది. కడుపు సమస్యలు తగ్గుతాయి. రోజూ 5 నుంచి 10 నిమిషాలు వజ్రాసనం వేస్తే కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం...
బరువు తగ్గడానికి..
ఆయుర్వేదం ప్రకారం వజ్రాసనం.. బరువు తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది. తొడ, పొట్ట భాగంలో కొవ్వు తగ్గిస్తుంది. కడుపుని తేలిక చేసి, జీర్ణవ్యవస్థని బలపరుస్తుంది. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం లాంటి సమస్యలను తగ్గిస్తుంది. వజ్రాసనం రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది. భోజనం తర్వాత ఈ ఆసనం చేయడం చాలా మంచిది.
ఒత్తిడి తగ్గుతుంది
వజ్రాసనం అధిక రక్తపోటుని తగ్గిస్తుంది. కాళ్ల కండరాలని బలపరుస్తుంది. శరీరానికి శక్తినిస్తుంది. వజ్రాసనంలో కూర్చొని లోతైన శ్వాస తీసుకుంటే.. ఊపిరితిత్తులు బలపడతాయి. పొట్ట ఉబ్బినట్లు అనిపిస్తే.. రోజూ వజ్రాసనం చేస్తే కొన్ని రోజుల్లోనే తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది
ఆహారం ఈజీగా జీర్ణమవుతుంది
కొన్నిసార్లు ఇష్టమైన ఆహారం ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. ఛాతి కింద ఒత్తిడిగా ఉంటుంది. అలాంటప్పుడు వజ్రాసనం వేస్తే చాలా మంచిది. భోజనం తర్వాత 3-5 నిమిషాలు వజ్రాసనంలో కూర్చుంటే.. ఆహారం ఈజీగా జీర్ణమవుతుంది. కడుపు తేలికవుతుంది. వజ్రాసనం జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. కండరాలని సాగేలా చేస్తుంది. నడుం నొప్పిని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రిస్తుంది.
వజ్రాసనం చేసే విధానం
వజ్రాసనం చేయడం చాలా ఈజీ. ముందుగా.. మోకాళ్ల మీద కూర్చోవాలి. వెన్నెముక సరిగ్గా ఉండేలా వీపు నిటారుగా ఉంచాలి. పాదాలను నేల మీద ఉంచాలి. కాలి వేళ్లు నేలవైపుకి, మడమలు పైకి ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు శ్వాస మీద దృష్టి పెట్టి, ఈ భంగిమలో కొన్ని నిమిషాలు ఉండాలి. ఇలా వజ్రాసనం చేస్తే శరీరం రిలాక్స్ అవుతుంది.
గమనిక:
ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. కొత్తగా యోగా చేయాలనుకునే వారు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.