IMD Rain Alert : మళ్లీ వర్ష బీభత్సం.. ఈ 16 జిల్లాల్లో అల్లకల్లోలమే, ఎల్లో అలర్ట్
IMD Rain Alert : తెలంగాణ ప్రజలకు కూల్ న్యూస్. ఇవాళ ఒక్కరోజే ఎండలు మండిపోతాయట… రేపటి నుండి ఉష్ణోగ్రతలు తగ్గుతాయట. ఆదివారం నుండి వర్షాలు మొదలవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణ ప్రజలకు కూల్ న్యూస్
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి... ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెబుతోంది. నేటి (మార్చి 12, గురువారం) నుండి ఎండల తీవ్రత క్రమక్రమంగా తగ్గుతుందని తెలంగాణ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక మార్చి 15 అంటే వచ్చే ఆదివారం నుండి వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మార్చి 16/17 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ వర్షాలు కురుస్తాయని... మూడునాలుగు రోజులు కొనసాగే అవకాశాలున్నట్లు వాతావారణ శాఖ వెల్లడించింది.
తెలంగాణలో వర్షాలు
మార్చి 15న తేలిపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయట. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తస్మాత్ జాగ్రత్త..
తెలంగాణలో కేవలం వర్షాలు కాదు గంటలకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. కొన్నిచోట్ల పిడుగులు, వడగళ్ల వానలు కురిసే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణ మొత్తం వర్షాలే..
మొదట ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో మొదలయ్యే వర్షాలు క్రమక్రమంగా అన్ని జిల్లాలకు వ్యాపిస్తాయట. కాబట్టి రైతులు ఈ అకాల వర్షాలతో నష్టపోకుండా పంటలను కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వాతావరణ నిపుణులు. వర్షాల సమయంలో రైతులు, కూలీలు చెట్లకింద అస్సలు ఉండకూడదని... ఇది చాలా ప్రమాదకరం అని సూచించారు. ప్రజలు కూడా వర్షంలో బయటకు రావద్దని సూచిస్తున్నారు.
హైదరాబాద్ వెదర్
తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో ఇవాళ (గురువారం) ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 33-34° సెల్సియస్, కనిష్ఠంగా 22° సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఉంటాయని తెలిపింది. తర్వాత రెండుమూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని... ఆదివారం నగరంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.
బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి..
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది... దీని ప్రభావంతోనే దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఇప్పటికే తమిళనాడు తీరప్రాంత జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి... ఇవి ఇతర దక్షిణాది రాష్ట్రాలకు వ్యాపించే అవకాశాలున్నట్లు తెలిపింది. మార్చి 13 నుండి 16 వరకు దక్షిణ తమిళనాడు తీరప్రాంతాల్లో వర్షాలు మరింత జోరందుకుంటాయని వాతావరణ శాఖ పేర్కొంది.

