- Home
- Telangana
- Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల జోరు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల జోరు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్
Weather Update : తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. తెలంగాణలో జూన్ 10 వరకు భారీ వర్షాల హెచ్చరికలతో ఎల్లో అలర్ట్ జారీ చేయగా, ఏపీలో మాత్రం ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు!
గత కొన్ని రోజులుగా భానుడి భగభగలకు, విపరీతమైన ఉక్కపోతకు అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అదిరిపోయే చల్లటి కబురు చెప్పింది. ఎట్టకేలకు ఎల్నినో అంచనాలను తలకిందులు చేస్తూ నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) తెలుగు రాష్ట్రాల్లోకి చురుగ్గా ప్రవేశించాయి.
జూన్ 4న కేరళను తాకిన రుతుపవనాలు, కేవలం రెండు రోజుల్లోనే అంటే జూన్ 6 శనివారం నాటికి ఏపీలోని రాయలసీమ ప్రాంతాన్ని తాకాయి. అక్కడ నుంచి వేగంగా కదులుతూ తెలంగాణ వైపు దూసుకొస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండలు ఉన్నప్పటికీ, సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా కూల్ అయిపోయింది.
భాగ్యనగరాన్ని ముంచెత్తిన వాన.. జిల్లాల్లోనూ అదే జోరు
రుతుపవనాల ముందస్తు రాక సూచనలతో తెలంగాణలో చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం సాయంత్రం ఐటీ హబ్ హైదరాబాద్ను వాన ముంచెత్తింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఆకస్మిక వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ట్రాఫిక్కు స్వల్ప అంతరాయం కలిగింది.
నగరంలోని మియాపూర్, షేక్పేటలలో అత్యధిక వర్షపాతం రికార్డైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ, ఖైరతాబాద్ ఏరియాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. జిల్లాల విషయానికి వస్తే.. వికారాబాద్ జిల్లా తాండూరులో అత్యధిక వర్షపాతం నమోదైంది. దేవరకద్ర, మాడ్గులలలో కూడా భారీ వర్షం కురిసింది. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్, సంగారెడ్డి జిల్లాల్లోనూ వానలు దంచికొట్టాయి.
జూన్ 10 వరకు తెలంగాణకు ఎల్లో అలర్ట్.. పిడుగుల హెచ్చరిక
తెలంగాణ వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం.. జూన్ 10 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. వాన పడే టైంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ముఖ్యంగా పొలాల్లో ఉండే రైతులు, బయట తిరిగే జనాలు ఉరుములు వచ్చేటప్పుడు చెట్ల కింద గానీ, కరెంట్ స్తంభాల పక్కన గానీ నిలబడొద్దని, సురక్షితమైన ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు అలర్ట్ చేశారు. రానున్న మూడు రోజుల్లో ఎండ తీవ్రత తగ్గి, ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది.
ఏపీ రైతులకు బ్యాడ్ న్యూస్.. ఈసారి వానలు తక్కువేనా?
ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ రైతులకు ఒక ముఖ్యమైన అప్డేట్ ఇచ్చారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ లో ఏపీలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని బాంబ్ పేల్చారు. ఈసారి రుతుపవనాల ప్రయాణంలో తరచూ బ్రేక్స్ వచ్చే ప్రమాదం ఉందన్నారు.
అంటే కొన్ని రోజుల పాటు గ్యాప్ లేకుండా వానలు పడితే.. ఆ తర్వాత మరికొన్ని రోజుల పాటు వాతావరణం డ్రైగా, పొడిగా మారిపోతుంది. అందుకే రైతులు వాతావరణ మార్పులను గమనిస్తూ చాలా జాగ్రత్తగా పంటల ప్లానింగ్ చేసుకోవాలని సూచించారు. అయితే లోకల్ వాతావరణ మార్పుల వల్ల అక్కడక్కడా కురిసే వర్షాలు ఈ లోటును కొంతవరకు కవర్ చేయొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది.

