తెలంగాణలో ట్రాఫిక్ ఫైన్స్ పై బిగ్ అప్డేట్.. నెల రోజుల్లోగా ఇలా చేయకపోతే కుదరదు
Telangana: తెలంగాణలో ట్రాఫిక్ ఫైన్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ ఉల్లంఘనల సమాచారం ప్రతి వాహన యజమానికి సకాలంలో చేరేలా కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. లేకపోతే ఇబ్బందులు తప్పవని సూచించింది.

కీలక మార్పు
తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ ఫైన్లకు సంబంధించి కీలక మార్పులను ప్రకటించింది. ట్రాఫిక్ ఉల్లంఘనల సమాచారం ప్రతి వాహన యజమానికి సకాలంలో చేరేలా కొత్త నిబంధనలను ట్రాఫిక్ ఫైన్లకు వ్యవస్థలో అమలులోకి తెచ్చింది. ఈ కొత్త విధానం ప్రకారం, వాహనదారులు తమ ప్రస్తుత మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని కేంద్ర ప్రభుత్వ వాహన్ పోర్టల్ (http://vahan.parivahan.gov.in) లో నెల రోజులలోపు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని ఆదేశించింది.
ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన ఫైన్లకు సమాచారం అందక, పెండింగ్లో ఉన్న జరిమానాలు పేరుకుపోయి వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పారదర్శకతను పెంచడం, బకాయిల వసూళ్లను వేగవంతం చేయడం కూడా ఈ కొత్త నిబంధనల ముఖ్య ఉద్దేశ్యాలు.
కొత్త నిబంధనలు ఏమిటి?
తెలంగాణ రవాణా శాఖ కొత్త నిబంధనల ప్రకారం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు ఫైన్ల సమాచారం ఇకపై నేరుగా SMS, వాట్సాప్ లేదా వారి అధికారిక ఈ-మెయిల్ అడ్రస్లకు డిజిటల్ రూపంలో అందుతుంది. వాహనదారులు తమ వివరాలను నెల రోజుల్లోపు వాహన్ పోర్టల్లో అప్డేట్ చేసుకోవాలి. ఈ గడువు ముగిసిన తర్వాత, వాహన్ పోర్టల్లో నమోదైన మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్కు పంపిన SMS, వాట్సాప్ సందేశాలు లేదా మెయిల్లను వాహనదారుడికి అధికారికంగా చేరినట్లుగానే రవాణా శాఖ పరిగణిస్తుంది. 'మాకు ఫైన్ సమాచారం రాలేదు' వంటి సాకులను ఇకపై అంగీకరించరు.
తప్పుడు ఫైన్లపై ఎలా ఫిర్యాదు చేయాలి.?
ఒకవేళ వాహనదారుడికి తప్పుగా ఫైన్ జారీ అయితే, దాన్ని సవాల్ చేయడానికి ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టింది. వాహనదారులు నిర్దేశిత పోర్టల్ ద్వారా తగిన ఆధారాలతో ఆన్లైన్లో తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు. ఈ ఫిర్యాదులను పరిశీలించి, సంబంధిత అధికారి లిఖితపూర్వక ఉత్తర్వులను పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ఆ సమాచారం వాహనదారుడికి ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే అందుతుంది. ట్రాఫిక్ ఫైన్ల పై వచ్చే అభ్యంతరాలను పరిష్కరించడానికి పోలీస్, రవాణా శాఖలకు చెందిన అధికారులను ప్రభుత్వం నియమించింది.
ఫైన్ జారీ అయిన 45 రోజుల్లోపు దాన్ని చెల్లించాలి. ఒకవేళ అభ్యంతరం తిరస్కరణకు గురైతే, ఆ ఆర్డర్ వచ్చిన 30 రోజుల్లోపు ఫైన్ మొత్తం చెల్లించాలి లేదా 50% డిపాజిట్ చేసి కోర్టును ఆశ్రయించవచ్చు. ఫైన్ క్లియర్ చేయకపోతే, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఎలాంటి అప్లికేషన్లను రవాణా శాఖ ప్రాసెస్ చేయదు. రాబోయే 6 నెలల్లో ప్రస్తుత ఫైన్ల జారీ విధానం పూర్తిగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన సారథి, వాహన్ ఈ-ఫైన్ సిస్టమ్లోకి మారనుంది.
ఈ కొత్త నిబంధనలు వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనల పట్ల మరింత అప్రమత్తంగా ఉండేందుకు సహాయపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. వాహనదారులు ఎలాంటి జరిమానాలు, చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే వెంటనే తమ వివరాలను వాహన్ పోర్టల్లో నమోదు చేసుకోవడం మంచిది.

