Weather Update : రేపు ఒక్కరోజు జాగ్రత్త... హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక
IMD Heat Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో రేపు (మార్చి 12న) ఎండలు మండిపోతాయట. ఆ తర్వాత మళ్ళీ వాతావరణం చల్లబడుతుందని… ఆదివారం నుండి వర్షాలు మొదలవుతాయని వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

మండిపోనున్న ఎండలు..
Heat Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా ఎండల తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. చాలా చోట్ల 40 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు పగటిపూట బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది... రాష్ట్ర ప్రజలు రేపు (గురువారం) ఒక్కరోజు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మార్చి 12న అన్నిజిల్లాల్లో 36 నుండి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఈ శుక్రవారం నుండి కూల్ వెదర్
ఊరటనిచ్చే విషయం ఏంటంటే శుక్రవారం నుండి ఉష్ణోగ్రతలు మెల్లిగా తగ్గుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇలా రెండ్రోజులు ఆకాశం మేఘాలతో నిండివుండి ఆహ్లాదకర వాతావరణం ఉంటుందని... 36 డిగ్రీల కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు ఉంటాయట. మూడోరోజు అంటే మార్చి 15 (ఆదివారం) నుండి వర్షాలు మొదలవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రెండుమూడు రోజులు ఈ వర్షాలు కొనసాగుతాయని అంచనా వేస్తోంది.
మార్చి 15 నుండి తెలంగాణలో వానలు
మార్చి 15న అంటే ఆదివారం తేలిపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయట.గంటలకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందట… అందుకే ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
హైదరాబాద్ వాతావరణం
తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో రేపు (గురువారం) ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని... గరిష్ట ఉష్ణోగ్రత 33-34° సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22° సెల్సియస్ వరకు ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. తర్వాత రెండుమూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని... ఆదివారం నగరంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.
బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది... దీని ప్రభావంతోనే దక్షిణాదిన వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఇప్పటికే తమిళనాడు తీరప్రాంత జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఇవి ఇతర దక్షిణాది రాష్ట్రాలకు వ్యాపిస్తాయని... మార్చి 13 నుండి 16 వరకు దక్షిణ తమిళనాడు తీరప్రాంతాల్లో వర్షాలు మరింత జోరందుకుంటాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఏపీ ప్రజలు తస్మాత్ జాగ్రత్త..
ఇదిలావుంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తో చర్చించింది. కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో ఏపిఎస్డిఎంఏ కార్యాలయంలో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు... 'హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ 2026' ను ఆవిష్కరించారు. ముఖ్యంగా సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈ వేసవిలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది... ఈ క్రమంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా చూడాలని హోంమంత్రి ఆదేశించారు.
ఏపీలోని అన్ని ఆసుపత్రుల్లో ప్రత్యేక బెడ్లు, మందులు సిద్ధం చేయడంతో పాటు.. నిరంతర తాగునీటి సరఫరా, చలివేంద్రాల ఏర్పాటు చేయాలని సూచించారు. పశువుల రక్షణ, కార్మికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం తీసుకునే సూచనలను పాటించాలని హోంమంత్రి అనిత కోరారు.

