- Home
- Telangana
- IMD Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం అలర్ట్.. ఈ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు
IMD Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం అలర్ట్.. ఈ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 11 నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవడంతో పాటు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది.

భారీ వర్షాలు.. గంటకు 50 కిమీ వేగంతో గాలులు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో పాటు తీవ్రమైన ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బుధవారానికి బలమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రాబోయే మూడు నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు విడుదల చేసిన సమాచారం ప్రకారం, ఆగస్టు 10 నుంచి 17 వరకు రెండు రాష్ట్రాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయి.
ఏపీలో దంచికొడుతున్న వర్షాలు: కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్లో రాత్రి నుంచే పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ప్రారంభమయ్యాయి. నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు పడటంతో లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలమయమయ్యాయి. మంగళవారం రోజున విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశముంది.
ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని నగరి, అగ్రం, పిచ్చాటూరు, విజయపురం, కన్నవరం, సత్యవేడు, పుత్తూరు, నిండ్ర ప్రాంతాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) రాబోయే కొన్ని గంటల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. రాయలసీమలో మాత్రం వర్షపాతం ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ బలమైన ఈదురుగాలులు వీస్తాయి.
తెలంగాణలోనూ వానల జోరు.. కానీ 13 జిల్లాల్లో లోటు వర్షపాతం
తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు 10 రాత్రి నుంచే అనేక జిల్లాల్లో వాతావరణం మారిపోయింది. సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో సంగారెడ్డి జిల్లా నాగలగిద్దలో 2.35 సెం.మీ, కరీంనగర్ జిల్లా హూజూరాబాద్లో 2.11 సెం.మీ, మెదక్ జిల్లా నర్సింగిలో 2.03 సెం.మీ వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్ నగరం, దాని పరిసర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 30°C, కనిష్ట ఉష్ణోగ్రత 23°C గా నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకానం.. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణం కంటే 7 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, 13 జిల్లాల్లో ఇది మైనస్ 20 శాతంగా ఉంది. ఆగస్టు 13 ఉదయం వరకు రాష్ట్రంలో గంటకు 30-40 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
రైతులకు, వాహనదారులకు ముందస్తు సూచనలు
అకస్మాత్తుగా కురిసే వర్షాల వల్ల రోడ్లు తడిసి జారే ప్రమాదం ఉందని, కాబట్టి వాహనదారులు ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు, గాలుల వేగం ఎక్కువగా ఉండే సమయాల్లో పంటలపై రసాయనాలు, పురుగుమందులు పిచికారీ చేయడం లేదా పంట కోతల పనులను కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలని రైతులకు సూచించారు.
పిడుగులు, ఈదురుగాలుల వేళ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే సమయంలో విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలకు పలు కీలక సూచనలు చేసింది. బలమైన గాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు లేదా పాత నిర్మాణాలు కూలే ప్రమాదం ఉంది. వర్షం పడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ హోర్డింగ్స్, చెట్ల కింద నిలబడకూడదని స్పష్టం చేశారు. విద్యుత్ లైన్లకు దూరంగా ఉంటూ, సురక్షితమైన పక్కా భవనాల్లో తలదాచుకోవాలని అధికారులు ప్రజలను కోరారు.

