- Home
- Telangana
- Weather Update: కుండపోత వర్షాలు, ఈదురు గాలులు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్
Weather Update: కుండపోత వర్షాలు, ఈదురు గాలులు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్
Weather Update: ఎండలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. రాబోయే రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

ఈదురు గాలులు, పిడుగులతో వానలు.. వాతావరణ శాఖ వార్నింగ్
గత కొన్ని రోజులుగా భానుడి భగభగలకు, ఉక్కపోతకు అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. దక్షిణ తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, యానాం పరిసర ప్రాంతాలలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
దీని ప్రభావంతో జూన్ 6 నుంచి జూన్ 10 వరకు ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ వానల దెబ్బకు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 2 నుండి 5 డిగ్రీల వరకు తగ్గిపోనున్నాయి.
తెలంగాణలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్తో తెలంగాణలోని పలు జిల్లాల్లో శనివారం భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఇవాళ వానలు దంచికొట్టనున్నాయి.
వీటితో పాటు నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ జిల్లాలలో కూడా అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అంచనా ఉంది. ఇవాళ, రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో భీకరమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అలర్ట్ చేసింది.
ఆంధ్రప్రదేశ్లో వింత వాతావరణం.. ఏపీ విపత్తుల నివారణ సంస్థ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చాలా విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు వర్షాలు, మరోవైపు మండే ఎండలతో వాతావరణం వైవిధ్యంగా ఉండబోతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఈ భిన్నమైన పరిస్థితులు ఉంటాయని, ప్రజలు అలర్ట్గా ఉండాలని సూచించింది.
ద్రోణి ప్రభావం వల్ల శనివారం పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
గంటకు 60 కిమీ వేగంతో గాలులు.. పిడుగుల జాగ్రత్తలు
శ్రీకాకుళం జిల్లా పరిసర ప్రాంతాలైన కొత్తూరు, హిరమండలంలో గంటకు 60 కిలోమీటర్లకు పైగా వేగంతో భీకరమైన గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మెరుపులు, ఉరుములతో కూడిన మోస్తరు వానలు పడనున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
అయితే, మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ జిల్లాల్లో ఎండ తీవ్రత కూడా గట్టిగానే ఉండనుంది. ఇక్కడ కొన్ని చోట్ల 40 నుండి 44 డిగ్రీల సెల్సియస్ వరకు, అలాగే అనకాపల్లి, కోనసీమ, పశ్చిమ గోదావరి, బాపట్ల లాంటి జిల్లాల్లో 40 నుండి 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది.
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. మన దగ్గరకు ఎప్పుడంటే?
దేశంలో వానాకాలం ఎంట్రీ ఇచ్చేసింది. వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల వల్ల ఈసారి నాలుగు రోజులు ఆలస్యంగా, అంటే జూన్ 4న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. సాధారణంగా ఇవి జూన్ 1నే రావాల్సి ఉంది. ప్రస్తుతం కేరళ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోకి కూడా ఇవి ఎంట్రీ ఇచ్చాయి.
ఈ రుతుపవనాలు రానున్న వారం రోజుల్లో క్రమంగా తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండు మూడు రోజుల్లోనే ఇవి తెలుగు రాష్ట్రాల్లోకి ఎంటర్ అయి, జూన్ 15 నాటికి ఆంధ్రప్రదేశ్ అంతటా పూర్తిగా విస్తరిస్తాయని సమాచారం.

