- Home
- Telangana
- Shabad Mass Murders : పోక్సో కేసులో రాజ్ కుమార్ అరెస్టే కాలేదా..? అతడిపై పోలీసులు పెట్టిన కేసులేంటో తెలుసా?
Shabad Mass Murders : పోక్సో కేసులో రాజ్ కుమార్ అరెస్టే కాలేదా..? అతడిపై పోలీసులు పెట్టిన కేసులేంటో తెలుసా?
రాష్ట్రావ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాబాద్ మాస్ మర్డర్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు నిందితుడు రాజ్ కుమార్ పోక్సో కేసులో అరెస్టే కాలేదని… యాంటిసిపేటర్ బెయిల్ పై బయటే ఉన్నాడా?

షాబాద్ లో మాస్ మర్డర్స్ కలకలం
Shabad Mass Murders : రంగారెడ్డి జిల్లా షాబాద్ లో గత రాత్రి మారణహోమం సాగింది. అభం శుభం తెలియని ఓ మైనర్ బాలికను వేధించిన ఓ మానవ మృగం పంజా విసిరింది. ఆడబిడ్డ మానప్రాణాలను రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడమే ఆ కుటుంబం తప్పయ్యింది. తనపైనే ఫోక్సో (POCSO) కేసు పెట్టిస్తారా అంటూ రెచ్చిపోయిన కిరాతకుడు అత్యంత పాశవికంగా అమ్మాయిని హతమార్చాడు. అంతటితో ఆగకుండా బాలిక అమ్మ, అమ్మమ్మను హతమార్చాడు. ఇంతటితో అతడి రక్తపాతం ఆగలేదు... చివరకు కట్టుకున్న భార్య, కన్న బిడ్డలను హతమార్చాడు. ఇలా ఆరుగురి ప్రాణాలు తీసి పరారయ్యాడు నిందితుడు రాజ్ కుమార్.
దైవాలగూడలో రాత్రి ఏం జరిగిందంటే...
రంగారెడ్డి షాబాద్ మండలం దైవాలగూడలో రాజ్ కుమార్ నివాసం ఉండేవాడు. అయితే ఇతడు ఇప్పటికే ఓ యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు... వీరికి ఇద్దరు పిల్లలు సంతానం కూడా. ఇలా భార్యాబిడ్డలు ఉండగానే ఇంటిపక్కన ఉండే ఓ మైనర్ బాలికను ప్రేమపేరిట వేధించేవాడు. దీంతో సదరు బాలిక విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది... వాళ్లు రాజ్ కుమార్ ను మందలించారు. అయినప్పటికి అతడు బాలికను వేధించడం ఆపలేదు... దీంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
మైనర్ బాలికను లైంగికంగా వేధించడంతో రాజ్ కుమార్ పై షాబాద్ పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. ఇలా తనపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఆ కుటుంబంపై నిందితుడు కక్షగట్టాడు. ఈ క్రమంలోనే గత రాత్రి 11 గంటల నుండి 1 గంటలపాటు అంటే రెండుగంటల్లో ఆరుగురిని హతమార్చాడు. మొదట బాలిక ఇంటికి వెళ్లి ఆమె కళ్లముందే తల్లిని, నాన్నమ్మను హతమార్చాడు.. బాలికను ఊరి చివరికి ఎత్తుకెళ్లాడు. అక్కడ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి గొంతు కోసం దారుణంగా చంపేశాడు.
ఇలా ముగ్గురిని చంపిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళాడు రాజ్ కుమార్. గాఢ నిద్రలో ఉన్న భార్యను లేపి కత్తితో దాడి చేశాడు... అతడినుండి తప్పించుకునేందుకు ప్రయత్నించినా వదల్లేదు. అతి కిరాతకంగా ఆమెను నరికి చంపాడు. తర్వాత ఇద్దరు పిల్లలను కూడా హతమార్చాడు. ఇలా ఆరుగురిని హతమార్చిన తర్వాత కారులో పరారయ్యాడు రాజ్ కుమార్. ఈ హత్యల గురించి తండ్రికి ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
రాజ్ కుమార్ అసలు అరెస్టే కాలేదా..?
మైనర్ బాలికను వేధించిన రాజ్ కుమార్ అసలు అరెస్ట్ కాలేదట... గత 55 రోజులుగా అతడు పరారీలోనే ఉన్నాడని టిఆర్ఎస్ నేత, మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. అతడు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని అరెస్ట్ నుండి తప్పించుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. తమకు ప్రాణహాని ఉందని బాధిత కుటుంబం పోలీసులకు తెలిపినా స్టేషన్ బెయిల్ ఇయ్యగలిగే సెక్షన్ 78, 351, సెక్షన్ 11 ఆఫ్ పోక్సో యాక్ట్ కేసులు పెట్టారని అన్నారు. తర్వాత అయినా మహిళా పోలీసులతో బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేసి కఠినమైన సెక్షన్లు పెట్టాల్సింది... కానీ అలా చేయలేదని పేర్కొన్నారు. అందువల్లే రాజ్ కుమార్ కు ఈజీగా యాంటిసిపేటరీ బెయిల్ లభించిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబం ప్రాణభయంతో వణికిపోతున్నా పోలీసులు కనీసం నిందితుడిని స్టేషన్ కు పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వలేదని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. పోలీసులు సరైన రీతిలో స్పందించివుంటే ఇంత ఘోరం జరిగివుండేది కాదన్నారు. బాలిక కుటుంబం ఫిర్యాదు చేయగానే అతడిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటే ఇంతమంది ప్రాణాలు పోయేవికావన్నారు. ఇప్పుడు ఆరుగురిని చంపి కూడా నిందితుడు పరారీలు ఉన్నాడు.. అతడిని ఇంకా పట్టుకోకపోవడం దారుణమని బిఆర్ఎస్ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీయం రేవంత్ గారు,
అరెస్టు చేయాల్సింది మమ్ములను కాదు.
ఆరు మందిని పాశవికంగా హత్య చేసిన నిందితుడిని. వాడు ఇంకా పరారీలోనే ఉన్నాడు. తమరు మాత్రం ఖమ్మంలో పిక్నిక్ లో బిజీగా ఉన్నారు!!!
ప్రజలారా,
షాబాదు పట్టణంలో పోక్సో కేసులో నిందితుడు రాజ్ కుమార్ చేతిలో 6 మంది అమాయకులు నిన్న రాత్రి… pic.twitter.com/vB7S4uMrhL— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) July 11, 2026
షాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
దైవాలగూడ హత్యల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ముందుగానే బాధిత కుటుంబాన్ని చంపేస్తానని నిందితుడు బెదిరించాడు... అయినా పోలీసులు వారికి ప్రాణాలు కల్పించలేకపోయారని షాబాద్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యమే ఆరుగురి ప్రాణాలు బలికావడానికి కారణం అయ్యిందంటే షాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష నాయకులు, వివిధ సంఘాల నాయకులు కూడా పోలీసుల తీరును తప్పుబడుతూ ఆందోళన చేపట్టారు. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే షాబాద్ ఘటనపై NHRC(నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్) లో ఫిర్యాదు నమోదయ్యింది. మైనర్ బాలికతో పాటు ఆరుగురి హత్యలకు కారణమైన షాబాద్ సిఐ కాంతారెడ్డి, ఎస్ఐ రమేష్ లపై వెంటనే చర్యలు తీసుకోవాలని న్యాయవాది రామారావు కోరారు. గతంలోనే ఫిర్యాదుచేసినా పోలీసులు నిర్లక్ష్యం వహించారని... అందువల్లే హత్యలు జరిగాయని పేర్కొన్నారు.
షాబాద్ ఘటనలో మృతుల వివరాలు
షాబాద్ మండలం దైవాలగూడలో రాజ్ కుమార్ చేతిలో 17 ఏళ్ల ఇంటర్మీడియట్ బాలిక హతమయ్యింది. ఇక ఆమె తల్లి చిట్యాల లక్ష్మి(45), నాన్నమ్మ చిట్యాల రుక్కమ్మ(65) ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు రాజ్ కుమార్ భార్య పార్వతి సరిత (30), కొడుకు పరీక్షిత్(3), దైవిక్షిత్(2) కూడా చనిపోయారు. అందరినీ రాజ్ కుమార్ అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపినట్లు తెలుస్తోంది.

