- Home
- Telangana
- Revanth Reddy: హైడ్రా విషయంలో అస్సలు తగ్గేదేలే లేదు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Revanth Reddy: హైడ్రా విషయంలో అస్సలు తగ్గేదేలే లేదు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Revanth Reddy: తెలంగాణలో ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, పార్కులను ఆక్రమణల నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

హైడ్రా లక్ష్యం ప్రజా ఆస్తుల పరిరక్షణే
హైడ్రా ఏర్పాటు వెనుక ఉద్దేశం చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమణల నుంచి కాపాడటమేనని సీఎం వివరించారు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని చెప్పారు. ఈ విషయంలో పేదలు, ధనికులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు అనే తేడా ఉండదని స్పష్టం చేశారు. గతంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఆక్రమణలను ప్రస్తావిస్తూ, పేరుపలుకుబడి ఉన్న వ్యక్తులు కూడా నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయని వెల్లడించారు.
హైకోర్టు ఉత్తర్వులను అధ్యయనం చేసిన తర్వాతే తదుపరి నిర్ణయం
హైడ్రాకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పూర్తిగా పరిశీలిస్తోందని సీఎం తెలిపారు. న్యాయస్థానం సూచించిన ప్రతి అంశాన్ని విశ్లేషించిన తర్వాతే తదుపరి కార్యాచరణను ఖరారు చేస్తామని చెప్పారు. రాష్ట్ర పరిపాలనలో అధికారుల నియామకాలు, బాధ్యతల కేటాయింపు వంటి అంశాలు ప్రభుత్వ అధికార పరిధిలోనే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. హైడ్రా అమలు వల్ల ప్రజా ప్రయోజనాలు కాపాడుతున్నామని, అందుకే ఈ వ్యవస్థకు విస్తృత స్థాయిలో మద్ధతు లభిస్తోందని అభిప్రాయపడ్డారు.
తప్పుడు ప్రచారాలపై సీఎం ఆగ్రహం
హైడ్రా చర్యలను దెబ్బతీయడానికి కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం ఆరోపించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని విమర్శించారు. అక్రమ నిర్మాణాలు, భూకబ్జాలకు పాల్పడినవారే హైడ్రాపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కొందరు కోర్టును కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తూ, ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రారంభించిన సంస్కరణలు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగుతాయని స్పష్టం చేశారు.
అసలేం జరిగిందంటే.?
హైడ్రా కమిషనర్గా కొనసాగుతున్న ఎ.వి. రంగనాథ్ను ఆ బాధ్యతల నుంచి తప్పించి, ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు సోమవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పదేపదే పట్టించుకోకుండా వ్యవహరించడం అత్యంత ఆందోళనకరం అని కోర్టు పేర్కొంది. ఇటువంటి వైఖరి చట్టబద్ధ పాలనకు విఘాతం కలిగించే అవకాశముందని, న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించింది.
కోర్టు ఆదేశాలను నిరంతరం ఉల్లంఘించే అధికారి కీలక పదవిలో కొనసాగడం సముచితం కాదని స్పష్టం చేసిన ధర్మాసనం, అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కోర్టు ధిక్కరణకు పాల్పడిన అధికారులపై కఠిన శిక్షలను సిఫార్సు చేయడం మినహా మరో మార్గం కనిపించడం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఫీజు రీయింబర్స్మెంట్కు కొత్త విధానం
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం వెల్లడించారు. ఇకపై ఏ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు అయినా అదే ఏడాదిలో చెల్లించే విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. ప్రతి సంవత్సరం ఇందుకోసం రూ. 2,200 కోట్లు కేటాయించి, అర్హులైన విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేసే విధానాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన భారీ బకాయిలను కూడా దశలవారీగా క్లియర్ చేస్తున్నామని వివరించారు.
పరీక్షల భద్రత, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలో పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పటిష్టమైన వ్యవస్థను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రశ్నపత్రాల లీకేజీలను పూర్తిగా అరికట్టేందుకు ఆధునిక సాంకేతికతతో కూడిన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఒకవైపు ప్రజా ఆస్తుల పరిరక్షణ, మరోవైపు విద్యా వ్యవస్థలో పారదర్శకత పెంపు వంటి అంశాల్లో ప్రభుత్వం సంస్కరణలను నిరంతరం కొనసాగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

