- Home
- Telangana
- Ration Card: రేషన్ కార్డు ఉన్నవాళ్లకు అదిరిపోయే న్యూస్.. ఆగస్టు 31 వరకు ఆ పని చేయొచ్చు.. మరో బంపర్ ఆఫర్!
Ration Card: రేషన్ కార్డు ఉన్నవాళ్లకు అదిరిపోయే న్యూస్.. ఆగస్టు 31 వరకు ఆ పని చేయొచ్చు.. మరో బంపర్ ఆఫర్!
Ration Card: తెలంగాణలో రేషన్ కార్డు ఈ-కేవైసీ గడువును ప్రభుత్వం పొడిగించింది. అలాగే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల రేషన్ సరుకులను ఒకేసారి పంపిణీ చేయనున్నారు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

రేషన్ కార్డుదారులకు సూపర్ న్యూస్ చెప్పిన సర్కారు
తెలంగాణలోని ఆహార భద్రత కార్డు (రేషన్ కార్డు) లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఇప్పటివరకు ఈ-కేవైసీ పూర్తి చేయని వారి కోసం చివరి తేదీని మరో నెల రోజుల పాటు, అంటే ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటు రేషన్ పంపిణీకి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఒకేసారి మూడు నెలల (ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్) రేషన్ కోటాను పంపిణీ చేయాలని నిర్ణయించింది.
ఈకేవైసీ గడువు ఎందుకు పెంచారంటే?
వాస్తవానికి ఈ-కేవైసీ పూర్తి చేయడానికి జులై 31 చివరి రోజు. అయితే, ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, మరోవైపు వేగంగా జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. వర్షాకాలంలో ప్రజలు రేషన్ షాపుల వద్ద ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో చీఫ్ రేషనింగ్ అధికారి రాజిరెడ్డి, హైదరాబాద్ జిల్లా పౌర సరఫరాల అధికారి కే. శ్రీనివాస్ ఈ వివరాలను వెల్లడించారు. గడువు పెరగడంతో ఈకేవైసీ పూర్తి చేయని లక్షలాది మందికి పెద్ద ఊరట లభించింది.
ఒకేసారి 3 నెలల కోటా ఉచిత బియ్యం
ఆగస్టు 1 నుంచి 31 వరకు లబ్ధిదారులు తమ సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్లి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన బియ్యం, గోధుమలను ఒకేసారి తీసుకోవచ్చు. ప్రతినెల రేషన్ షాపుల చుట్టూ తిరిగే పని లేకుండా, రద్దీని నివారించేందుకు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఈ ఏర్పాటు చేశారు.
• ఉచిత బియ్యం, గోధుమలు: బియ్యాన్ని పూర్తి ఉచితంగా పంపిణీ చేస్తుండగా, గోధుమలను మాత్రం కిలో రూ. 7ల రాయితీ ధరకే అందజేస్తున్నారు.
• హైదరాబాద్ కేటాయింపులు: హైదరాబాద్ జిల్లా పరిధిలోని 653 చౌక ధరల దుకాణాల ద్వారా 8,43,607 ఆహార భద్రత కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం 59,602.822 మెట్రిక్ టన్నుల బియ్యం, 7,279.513 మెట్రిక్ టన్నుల గోధుమలను ప్రభుత్వం కేటాయించింది.
ఈ-కేవైసీ ఎందుకు తప్పనిసరి? ఎక్కడ చేసుకోవాలి?
రేషన్ పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసి, పారదర్శకత పెంచడమే ఈకేవైసీ ముఖ్య ఉద్దేశం. మరణించిన వారి పేర్లు, ఏళ్లుగా సరుకులు తీసుకోని వారిని గుర్తించి అర్హులైన పేదలకు మాత్రమే ఫలాలు అందేలా ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టింది. ఈకేవైసీ పూర్తయిన లబ్ధిదారులకే రేషన్ సరుకులు అందుతాయి. చేయించకపోతే భవిష్యత్తులో లబ్ధిని కోల్పోయే ప్రమాదం ఉంది.
• ఎక్కడ చేయాలి?: మీ సమీపంలోని రేషన్ షాపులోని ఈ-పోస్ యంత్రంలో వేలిముద్ర లేదా కంటిపాప స్కాన్ ఇవ్వడం ద్వారా పూర్తి చేయవచ్చు. మీసేవా కేంద్రాల ద్వారా కూడా చేసుకోవచ్చు.
• కావాల్సినవి: రేషన్ కార్డుతో పాటు, అందులో నమోదైన కుటుంబ సభ్యులందరూ అంటే 5 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఒరిజినల్ ఆధార్ కార్డులు తీసుకెళ్లాలి.
• ఉచిత సేవ: ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి ఉచితం. దీనికి డీలర్లకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.
• రేషన్ పోర్టబిలిటీ: ఉపాధి, ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు సొంత ఊళ్లకు వెళ్లాల్సిన పనిలేదు. 'రేషన్ పోర్టబిలిటీ' ద్వారా మీరు ప్రస్తుతం ఉంటున్న ప్రాంతంలోని ఏ రేషన్ షాపులోనైనా ఈ-కేవైసీ చేసుకోవచ్చు.
మీ రేషన్ కార్డు ఈ-కేవైసీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
మీ రేషన్ కార్డులోని సభ్యులకు ఈ-కేవైసీ పూర్తయిందో లేదో ఇంటి వద్దే ఉండి ఫోన్ లో చెక్ చేసుకోవచ్చు:
1. ముందుగా తెలంగాణ స్మార్ట్ పీడీఎస్ అధికారిక పోర్టల్ ([https://smartpds.telangana.gov.in/](https://smartpds.telangana.gov.in/)) ఓపెన్ చేయాలి.
2. హోమ్ పేజీలో ఉండే Beneficiary Details అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
3. మీ రేషన్ కార్డు నంబర్, స్క్రీన్ పై కనిపించే క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
4. స్క్రీన్ పై మీ రేషన్ కార్డులోని సభ్యుల వివరాలు, వారి ఈ-కేవైసీ స్టేటస్ కనిపిస్తుంది.
5. స్టేటస్ 'Active' అని ఉంటే మీ కేవైసీ పూర్తయినట్లే.
ఆగస్టు 31 వరకు సమయం ఉన్నప్పటికీ, చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే సమీప రేషన్ షాపుకు వెళ్లి ఈ-కేవైసీ పూర్తి చేసుకుని, 3 నెలల రేషన్ సరుకులను తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

